శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఈ అపూర్వమైన ఘట్టానికి పీఎం మోదీ హాజరై అంకురార్పణ చేయనున్నారు. ఇప్పటికే భూమిపూజ కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45గంటల మధ్య ఈ కార్యక్రమం జరుగనుంది.
రామాలయం శంకుస్థాపన కార్యక్రమానికి 175 మందికి శ్రీరామజన్మ భూమి క్షేత్ర ట్రస్టు ఆహ్వానం పంపింది. ఇందులో 135 మంది వివిధ క్షేత్రాలకు చెందిన సాధువులు ఉన్నారు. వేర్వేరు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన ప్రతినిధులున్నారు. అయోధ్య భూవివాదంలో ముస్లింల తరఫున పోరాడిన ఇక్బాల్ అన్సారీకి ట్రస్టు తొలి ఆహ్వానం పంపింది.
ఇక వేదికపై కొద్ది మంది మాత్రమేలు అతిథులు ఆసీనులు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసీనులు కానున్నారు. కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు.