అసెంబ్లీ సాక్షిగా మణిపూర్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఆ రాష్ట్ర సీఎం ఎన్. బీరేన్ సింగ్ నెగ్గారు. బలపరీక్ష కోసం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో విశ్వాసం పొందేందుకు బీరేన్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఎన్.బీరేన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కారు గెలుపొందింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ వైపు కుర్చీలు విసిరేశారు. తమ అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ స్వీకరించలేదని ఆరోపించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ పై ఆరోపణలు సరికాదని సీఎం బీరెన్ సింగ్ అన్నారు. స్పీకర్ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నారని అన్నారు. మూజువాణీ ఓటుతో తాము గెలిచామని అన్నారు. కాగా.. జూన్లో బీజేపీకి ఎన్పీపీ ఎమ్మెల్యేల మద్దుతు ఉపసంహరించుకోవడంతో ఈ సంక్షోభానికి తెరలేచింది. అయితే, తాజాగా జరిగిన బలపరీక్షలో ఎన్పీపీ సభ్యులు మళ్లీ బీజేపీ గూటికి చేరడంతో ఈ సంక్షోభానికి తెరపడింది.