AMARAVATHI: ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్ దిశగా కీలక ముందడుగు
దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్ వేర్ టెస్ట్ బెడ్ లు.. అమరావతిలోని ఎస్ఆర్ఎం వర్సిటీలో ఏర్పాటు.. ఈనెల 14న ఆరంభించనున్న సీఎం చంద్రబాబు
అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగా కీలకమైన ముందడుగుగా దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్బెడ్లు అమరావతిలో ఏర్పాటు అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి “క్వాంటమ్ వ్యాలీ”గా రూపుదిద్దుకునే దిశలో ప్రయాణం ప్రారంభమైందని చెప్పాలి. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న ఈ సదుపాయాలను అధికారికంగా ప్రారంభించనున్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీతో పాటు విజయవాడలోని మేధాటవర్స్లో ఈ టెస్ట్బెడ్లు ఏర్పాటు చేయడం ప్రత్యేకత. వీటిని “భారత్ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్”గా అభివర్ణిస్తున్నారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన చిన్న పరిమాణం గల రెండు క్వాంటమ్ కంప్యూటర్లు ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నాయి.
క్వాంటమ్ రంగంలో అనుభవం ఉన్న దేశీయ, అంతర్జాతీయ నిపుణులు కలిసి స్థాపించిన స్టార్టప్ సంస్థ క్యూబిట్ ఫోర్స్ ఈ కంప్యూటర్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించింది. ఎస్ఆర్ఎంలో “అమరావతి 1ఎస్” పేరుతో ఒక కంప్యూటర్ను ఏర్పాటు చేస్తుండగా, మరో కంప్యూటర్ను “అమరావతి 1క్యూ” పేరుతో మేధాటవర్స్లో అమలు చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉపయోగించిన హార్డ్వేర్ పరికరాలను దేశంలోని ప్రముఖ శాస్త్రసాంకేతిక సంస్థలు, రక్షణ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కలిసి తయారు చేశాయి. టీఐఎఫ్ఆర్ ముంబయి, ఐఐఎస్సీ బెంగళూరు వంటి ప్రముఖ విద్యాసంస్థలు క్వాంటమ్ ప్రాసెసర్ల అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యాయి. డీఆర్డీఓ ల్యాబ్లు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ను అందించగా, మరికొన్ని సంస్థలు క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్ భాగాలను సమకూర్చాయి.
ఈ రిఫరెన్స్ ఫెసిలిటీల ప్రధాన లక్ష్యం కేవలం పరిశోధనకే పరిమితం కాకుండా, క్వాంటమ్ హార్డ్వేర్ తయారీకి బలమైన వేదికను అందించడం. ఇప్పటివరకు భారతదేశంలో తయారైన క్వాంటమ్ పరికరాలను పరీక్షించడానికి విదేశాలకు పంపాల్సి వచ్చేది. ఆ ప్రక్రియకు నెలల సమయం పట్టేది. కొన్ని దేశాలు ఈ పరీక్షలకు అనుమతి కూడా ఇవ్వకపోవడం వల్ల పరిశోధనకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు అమరావతిలో ఈ సదుపాయాలు అందుబాటులోకి రావడంతో దేశీయ సంస్థలకు పెద్ద ఊరటనిస్తుంది. ఈ కేంద్రాలు పరిశోధకులు, స్టార్టప్లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, విద్యార్థులందరికీ అందుబాటులో ఉండటం మరో ముఖ్యాంశం. ఇప్పటి వరకు పుస్తకాలలో మాత్రమే చదివిన క్వాంటమ్ టెక్నాలజీని విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం లభిస్తుంది. 111 క్యూబిట్స్ వరకు ఉన్న ప్రాసెసర్లను పరీక్షించగల సామర్థ్యం ఈ సదుపాయాలకు ఉంది. భవిష్యత్తులో దీనిని మిలియన్ క్యూబిట్స్ స్థాయికి పెంచే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లలో కీలక పాత్ర పోషించే క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ల తయారీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది. క్వాంటమ్ కంప్యూటర్లు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే పని చేస్తాయి. అందుకే -270 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తగ్గించే ప్రత్యేక సాంకేతికత అవసరం. ఈ అవసరాన్ని తీర్చే విధంగా దేశీయంగా ఈ పరికరాలను అభివృద్ధి చేయడం ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు.
ఈ సదుపాయాలు కేవలం క్వాంటమ్ కంప్యూటింగ్కే కాకుండా రక్షణ, ఆరోగ్య, అంతరిక్ష, సెమీకండక్టర్ తయారీ వంటి రంగాలకు కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. క్రయోజెనిక్ సిస్టమ్స్ ఎంఆర్ఐ యంత్రాల్లో, అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగపడతాయి. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ రాడార్, డిఫెన్స్ సెన్సింగ్ వ్యవస్థలకు దోహదపడుతుంది. మొత్తంగా చూస్తే, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న ఈ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ దేశానికి ఒక మైలురాయిగా నిలవనున్నాయి. క్వాంటమ్ టెక్నాలజీలో భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే స్థాయికి చేరుకునే మార్గాన్ని ఇవి సుగమం చేస్తాయని చెప్పాలి.