APDSC: వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
వర్గీకరణపై రెండురోజుల్లో ఆర్డినెన్స్... వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్;
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో ఏపీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డీఎస్సీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. ఈ ప్రక్రియలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్పై ముందుకెళ్దామని ఆలోచన చేయడంతోనే ఆలస్యమైందని చెప్పారు. ఎస్సీ కమిషన్ రిపోర్టుపై ఏప్రిల్ 15న క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని లోకేష్ వెల్లడించారు.
స్పెషల్ నోటిఫికేషన్
వారం రోజులలోపు ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక విద్య టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులను ఇందులో కాకుండా… వేరే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో గతంలో ప్రకటించిన మాదిరిగానే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన రానుంది. కోర్టు కేసుల రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే క్రమంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యమైందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల వారీగా అమలు చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో… రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన జీవో విడుదల చేసిన తర్వాతే... డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో..
ఏపీలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరో 2,260 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో 1,136 ఎస్జీటీ ఖాళీలు ఉండగా… మరో 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.