AP: విజయవాడ నుంచి సింగపూర్కు నేరుగా విమాన సర్వీసులు
ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసు ఆరంభం.. వేగంగా విమానాశ్రయ పనులు;
విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, దుబాయ్కు విమాన సర్వీసులు ఆరంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు వెల్లడించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ హైవేను అనుసంధానిస్తూ వేసిన అప్రోచ్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మైసూరు ఎంపీ యదువీర కృష్ణదత్త, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఢిల్లీకి మరో కొత్త ఇండిగో సర్వీసును కూడా రామ్మోహన్ నాయుడు ఆరంభించారు. అమరావతికి దేశంలోని ఏ నగరం నుంచైనా తేలికగా వచ్చి వెళ్లేలా విమాన అనుసంధానం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ విజ్ఞప్తి చేశారన్నారు. ఈ మేరకు వరుసగా నూతన సర్వీసులను ఆరంభిస్తున్నామని తెలిపారు.
ఈ మూడు నెలల్లోనే విజయవాడ నుంచి నాలుగు కొత్త సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. ఇక్కడి నుంచి ఎన్నికల ముందుతో పోలిస్తే ప్రస్తుతం ప్రయాణికులు గణనీయంగా పెరిగారని... గతంలో నెలకు సగటున 85 వేల మంది రాకపోకలు సాగించగా, ప్రస్తుతం లక్షకు చేరారని వివరించారు. దేశంలోని విమానాశ్రయాలన్నింటిలో కలిపి 80 వేల మొక్కలు నాటాలని నిర్ణయించామని, దానిలో భాగంగా విజయవాడలో వెయ్యి నాటనున్నామని రామ్మోహన్నాయుడు తెలిపారు. విజయవాడ విమానాశ్రయంలోని ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను మరో ఏడాదిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
వేగంగా పనులు
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీలో గన్నవరం ఎయిర్పోర్టు విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతినెలా ఎయిర్ పోర్టును సందర్శిస్తున్న మంత్రి.. పనులు సాగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఏపీలో కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులను సైతం నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడుతోనూ, కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే చర్చలు జరిపారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపైనా అధ్యయనం చేయనున్నట్లు కేంద్ర మంత్రి ఇప్పటికే వెల్లడించారు. ఏపీలోని కుప్పం, నాగార్జునసాగర్, దొనకొండ, దగదర్తితో పాటుగా ఒంగోలు, అనంతపురంలోనూ విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్ల సంఖ్యను పెంచి అనుసంధానాన్ని పెంచి.. ఈస్ట్ కోస్ట్కు లాజిస్టిక్ హబ్గా తయారుచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.