సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘాటైన లేఖ

Update: 2020-12-15 12:21 GMT

ముఖ్యమంత్రి జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఘాటైన లేఖ రాశారు.. నెలాఖరులోగా రైతులను ఆదుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.. వరదలు, తుఫాన్లతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. ప్రకృతి వైపరీత్యాలతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు.. కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదలతోపాటు భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి తీరని నష్టాన్ని మిగిల్చాయన్నారు. అక్కడక్కడా మిగిలిన పంటలను నివర్‌ తుపాన్‌ తుడిచిపెట్టిందన్నారు. కడప జిల్లాలో పప్పుధాన్యాలు, అనంతపురంలో వేరుశనగ.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వరి పంటలకు అపార నష్టం కలిగిందన్నారు.

ఖరీఫ్‌ సీజన్‌లోనే 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 10వేల కోట్ల రూపాయలకుపైగా నష్టం జరిగిందన్నారు లోకేష్‌. రైతులను ఆదుకోవడంలోనే కాదు.. పంట నష్టపరిహారం లెక్కించడంలోనూ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని మండిపడ్డారు. చివరకు పంటల బీమా ప్రీమియం చెల్లించామని వ్యవసాయ మంత్రి సభలో అవాస్తవాలు చెప్పారని అన్నారు. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకం కింద పంటలకు ఎందుకు బీమా చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు లోకేష్‌. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు తక్షణ సాయంగా 5వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిన జగన్‌.. ముఖ్యమంత్రిగా 500 పరిహారం ఇవ్వడం సముచితమేనా అని లేఖలో ప్రశ్నించారు లోకేష్‌.

Tags:    

Similar News