REVANTH: ఆటంకాలు అధిగమిస్తాం... అభివృద్ధి సాధిస్తాం
కంచ గచ్చిబౌలిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు... అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని వ్యాఖ్య;
హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల్లో అభివృద్ధికి ఉన్న అడ్డంకులు తాత్కాలికమేనని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కంచ గచ్చిబౌలి భూముల్లో కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. పీజేఆర్ సేవలను స్మరించుకున్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్ను ప్రపంచ నగరాలతో పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యమని తేల్చి చెప్పారు. గతంలో కంచ గచ్చిబౌలి భూములపై ఉన్న వివాదాలు, ఆక్రమణలు వంటి అంశాలను పరోక్షంగా ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధిని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆటంకాలను అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పీజేఆర్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.
నాగార్జున రియల్ హీరో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడారు. హైదరాబాద్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గురించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ నాగార్జున గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జునే స్వయంగా వచ్చి రెండు ఎకరాల స్థలం ప్రభుత్వానికి అప్పజెప్పారు. నగర అభివృద్ధిలో హీరోగా ముందు ఉంటానని ఆయన అన్నారు. మంచి సంకల్పంతోనే ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారంటూ.. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వాలంటీర్గా ఆయన ముందుకు వచ్చారు' అని సీఎం అన్నారు. గతేడాది ఆగష్టు నెలలో మాదాపూర్లో ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్హాలును హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. నగరంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేతలకు చర్యలు చేపట్టింది. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని ప్రభుత్వం ప్రకటించింది. ఆపై ఆ చెరువు చుట్టూ ఉన్న పలు కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది.
తెలంగాణ రాష్ట్రాన్ని 3 లేయర్లుగా విభజించాలనుకున్నామని.. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్బన్ రీజియన్కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాలుష్యం కారణంగా ప్రస్తుతం ఢిల్లీలో నివసించలేని పరిస్థితి ఏర్పడిందని.. దేశ రాజధానిలో నివసించలేని పరిస్థితి వచ్చిందంటే కారణం పాలకులకు సరైన ప్రణాళిక లేకపోవడమేనని తేల్చి చెప్పారు.