Cyclone Michaung: అన్నదాతలకు అపార నష్టం

నీట మునిగిన లక్షల ఎకరాల పంట;

Update: 2023-12-08 00:45 GMT

మిగ్‌జాం అపారమైన పంటనష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా. మొత్తంగా 7 వేల కోట్ల రూపాయలకుపైగా అన్నదాతలు నష్టపోయారని భావిస్తున్నారు. అయినా ప్రభుత్వం పంట నష్ట తీవ్రతను అంచనా వేయడంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తుపాను హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి ప్రభావం 8 జిల్లాల్లోనే ఉంటుందంటూ వాటిపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం మిగతా జిల్లాలోనూ రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు.

శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఎక్కడ చూసినా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. ఉద్యాన పంటలు నేలకొరిగాయి. అత్యధికశాతం రైతులకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక..ఉత్త చేతులతో మిగిలారు. తుపాను తీరం దాటి 3 రోజులవుతున్నా వరద తగ్గలేదు. పొలాల్లో నీరు బయటకు పోలేదు. వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు పైర్లు నీటిలో నానుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని అంచనా. ఇందులో వరి సుమారు 12 లక్షల ఎకరాలు, మిరప 2.5 లక్షల ఎకరాలు, శనగ, కంది, మినుము 5.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయి. ఎకరాకు సగటున రూ. 20 వేల లెక్కన చూసినా.. పంటనష్టం రూ. 4 వేల కోట్ల పైనే ఉంటుంది. పండ్లు, పూలతోటలు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా. అరటి, బొప్పాయి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టం రూ. 1,250 కోట్ల వరకు ఉంటుంది. తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే.. ఇది రూ. 7 వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా. పంటలు దెబ్బతిన్న వారిలో 80% మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. కోత కోయించడం కంటే ట్రాక్టర్లతో దమ్ము తొక్కించేయడమే మేలని వరి రైతులు ఆలోచిస్తున్నారంటే..రాష్ట్రంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది.


అతి భారీవర్షాలు, తీవ్ర గాలులతో అన్ని జిల్లాల్లోనూ నష్టం జరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించినా పట్టించుకోలేదు. తుపాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచి.. 8 జిల్లాల్లోనే ప్రభావమంటూ.. వాటిపైనే దృష్టి పెట్టింది. మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం తీవ్రంగా ఉందని.. అక్కడి రైతులు కుదేలయ్యారని గుర్తించడం లేదు. తుపాను తీరం దాటే ముందురోజు కూడా ముఖ్యమంత్రి జగన్‌.. 8 జిల్లాల కలెక్టర్లు, అధికారులతోనే సమీక్షించారు. ప్రత్యేకాధికారులను కూడా ఈ జిల్లాలకే నియమించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పొగాకు పంటకూ తీరని నష్టం వాటిల్లింది. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో శనగ, కంది, మినుము పంటలు నీటిలోనే తేలుతున్నాయి.

 

Tags:    

Similar News