AP: వైసీపీ అస్మదీయ ఐపీఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు

స్థాయికి మించి పోస్టింగ్‌లు ఇచ్చిన జగన్‌ సర్కార్‌.... వైసీపీ అనుకూలంగా వ్యవహరించిన వారికి ప్రమోషన్లు

Update: 2024-01-30 08:51 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తిన అస్మదీయ ఐపీఎస్‌ అధికారులకు కీలక పోస్టులు దక్కాయి. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులను ఆయా పోస్టుల్లోకి బదిలీ చేసింది. స్థాయికి మించి పోస్టింగ్‌లు ఇచ్చింది. వివాదస్పద అధికారులను, వైసీపీకి బాగా అనుకూలంగా వ్యవహరించిన వారిని నెత్తిన పెట్టుకుంది. కొందరు మంత్రులు తమకు నచ్చిన అధికారులను నచ్చిన చోట నియమింపజేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన I.P.S అధికారులను జగన్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. జగన్ అస్మదీయులకు కీలక పోస్టింగ్‌లో స్థానం కల్పించింది. 30 మంది అధికారుల పోస్టుల్లో మార్పులు చేర్పులు చేసింది. కీలకమైన ఎన్నికల సమయంలో వారు ఆయా పోస్టింగ్‌ల్లోనే కొనసాగనున్నారు.

వైసీపీతో అంటకాగిన అధికారులకు కీలక స్థానాలే దక్కాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన నిఘా విభాగం ఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డిని విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాధిపతిగా నియమించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి హోదా కలిగిన అధికారులను మాత్రమే ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు. కానీ ఐజీ హోదా కలిగిన రఘురామ్ రెడ్డికి డీజీ ర్యాంకు పోస్టు కట్టబెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్‌కు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను సైతం రఘురామిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైసీపీకు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఈ పోస్టింగు దక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికార పార్టీకి కొమ్ముకాసిన మరికొందరు అధికారులకు సైతం కీలక పోస్టులు దక్కాయి. కర్నూలు రేంజి డీఐజీగా నియమితులైన CH. విజయారావు 2021-2023 మధ్య నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో వైసీపీకు పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. చోరీ కేసులో ఆధారాలు తారుమారు చేశారన్న విమర్శలూ ఉన్నాయి. అధికార పార్టీ నాయకులతో కలిసి వేధించడంతో పలువురు దళితులు ఆత్మహత్యలు చేసుకోగా, కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలాంటి అధికారికి కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలిచ్చారు. విశాఖ రేంజీ డీఐజీగా నియమితులైన విశాల్‌ గున్నీ సైతం 2020-22 మధ్య కాలంలో గుంటూరు ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడంతోపాటు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించిన వారిపై లాఠీఛార్జీకి పాల్పడ్డారు. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవల అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని తీవ్రంగా అణిచిచేశారు. అందుకు ప్రతిఫలంగానే అత్యంత కీలకమైన విశాఖ రేంజీ డీఐజీగా నియమించారన్న విమర్శలున్నాయి. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్న పల్లె జాషువా అత్యంత వివాదాస్పద అధికారి. ఈయన హయాంలోనే గుడివాడలో కేసినో నిర్వహించారు. అలాంటి అధికారికి చిత్తూరు జిల్లా ఎస్పీగా కీలక బాధ్యతలు అప్పగించారు. అనంతపురం ఎస్పీగా ఉన్న సమయంలో అధికార పార్టీకి అన్నివిధాల సహకరించిన ఫకీరప్పకు కీలకమైన విశాఖ జాయింట్ కమిషనర్ పోస్టింగ్ దక్కింది. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది ఫకీరప్పే.

Similar News