MEGA STAR: మెగాస్టార్ నోట.. "జై జనసేన" మాట
ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేన అయిందన్న మెగాస్టార్.. అభిమానుల్లో ఫుల్ జోష్;
మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. లైలా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్... చాలా ఏళ్ల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. ఫంక్షన్కు వచ్చిన అభిమానులంతా జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా.. జై జనసేన అంటూ నినదించారు. మెగాస్టార్ నోట జై జనసేన అని రావడం ఇదే తొలిసారి. నాటి ప్రజారాజ్యా పార్టీనే రూపాంతరం చెంది.. జనసేనగా మారిందని చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతా జనసేనే. జై జనసేన’ అంటూ నినదించి మెగా అభిమానులను చిరంజీవి ఉత్సాహపరిచారు.
చిరంజీవి నినాదంతో ఫుల్ జోష్
2008 ఆగష్టు 26న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకున్నారు. మొత్తం ఓట్లలో 18 శాతం ఓట్లు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చాయి. చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి గెలుపొందారు. ఆగష్టు 2011లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడక్కడ పవన్ కల్యాణ్ తప్ప చిరంజీవి ఎప్పుడూ మళ్లీ ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఇన్నేళ్లకు అనూహ్యంగా మళ్లీ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని మాట్లాడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
వాలంటైన్స్ డే సందర్భంగా "లైలా"
విష్వక్సేన్ కథానాయకుడిగా నటించిన ‘లైలా’. ఈ చిత్రం ఈనెల 14 న విడుదలవుతోంది. విష్వక్సేన్ తండ్రి కరాటే రాజుతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ చిరంజీవి పై వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజకీయంగా ఎదగాలనే తన కోరికను కరాటే రాజు తన దగ్గర ప్రస్తావించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. దాంతో ప్రజారాజ్యం తరపున అవకాశం ఇచ్చామని.... కానీ అప్పట్లో పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని చిరంజీవి చెప్పారు. మేనల్లుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ విజయం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ‘‘పుష్ప 2’ పెద్ద హిట్టయింది. అందుకు తాను గర్విస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ ఒక సినిమా బాగా ఆడితే దాన్ని ఇండ స్ట్రీలో ప్రతి ఒక్కరూ హర్షించాలని చిరంజీవి అన్నారు.