LOKESH: ప్రజల మనసులు గెలుచుకుంటున్న నారా లోకేశ్
ప్రజాదర్బార్ తలుపు తట్టిన వారికి అండగా లోకేశ్.. 75 శాతం సమస్యల పరిష్కారం;
ఏపీ మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తున్నారు. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ.. ప్రజాదర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు 50 ప్రజాదర్బార్లు నిర్వహించి బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ప్రజాదర్బార్ లో వచ్చిన విజ్ఞప్తుల్లో 75శాతం సమస్యలు పరిష్కరించారు. తాము కష్టాల్లో ఉంటే తొలుత గుర్తుచ్చేది మంత్రి నారా నారా లోకేష్ అని మంగళగిరి ప్రజలు చెబుతున్నారు.. లోకేశ్ నిర్వహించే ప్రజా దర్బార్ కు వస్తే తమ సమస్యలకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో లోకేశ్ మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నారు. గత పాలకుల మాదిరిగా బారికేడ్లు, పరదాలు లేకుండా తన ఇంటి ద్వారాలను లోకేశ్ ఎప్పుడూ తెరిచే ఉంచుతున్నారు.
మూడో రోజు నుంచే..
అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే లోకేశ్ చేసిన మంచి పని ప్రజాదర్బార్లో వినతిపత్రాలు స్వీకరిస్తానని ప్రకటించడం. విజయవాడలో స్థానికంగా ఉన్నప్పుడు ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజల నుంచి స్వీకరించడం మొదలు పెట్టారు. దీంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున లోకేశ్కు తమ సమస్యల్ని చెప్పుకోడానికి వెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా తీర్చాల్సినవైతే వెంటనే లోకేశ్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ
ఇప్పటి వరకు ప్రజల నుంచి మొత్తం 5,180 విజ్ఞప్తులు స్వీకరించినట్టు ఆయన పీఆర్వో వర్గాలు తెలిపాయి. వీటిలో 4,400 అర్జీలు పరిష్కారం పొందినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంకా 1,410 విజ్ఞప్తులు పెండింగ్లో ఉన్నట్టు సమాచారం. లోకేశ్ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యల్లో రెవెన్యూ, హోంశాఖ పరిధిలోనివి. ఆ తర్వాత మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందినట్టు తెలిసింది. భూవివాదాలకు సంబంధించి 1,585 ఫిర్యాదులు రాగా, వాటిలో 1,170 సమస్యలను పరిష్కరించినట్టు ప్రజాదర్బార్ నిర్వాహకులు వెల్లడించారు. ఇంకా 415 భూసమస్యల్ని పరిష్కరించాల్సి వుంది. ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందినట్టు సమాచారం.