టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు నగరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు.. నెల్లూరు నగరం జనసంద్రమైంది. యువగళం పాదయాత్రకు భారీగా జనం తరలిరావడంతో.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు లోకేష్. ఒక్క కిలోమీటర్ నడిచేందుకు గంటన్నర సమయం పడుతుంది. ప్రతి ఒక్కర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు.
లోకేష్కు దారి పొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలుకుతున్నారు. దారులన్నీ పసుపు పూల వనాన్ని తలపిస్తున్నాయి. జనం వేలాదిగా తరలిరావడంతో టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సింహపురి గడ్డపై టీడీపీ సత్తా చూపిస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వైసీపీకి వణుకు పుట్టిస్తామన్నారు. పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
తనను కలిసేందుకు వస్తున్న ప్రజల్ని పలకరిస్తూ.. వారిని అక్కన చేర్చుకుంటున్నారు లోకేష్. వారిలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. అటు.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.