PROTESTS: తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆందోళనల హోరు

ఏపీలో వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన వైసీపీ... మహాధర్నాకు తరలిరావాలన్న ఎమ్మెల్సీ కవిత;

Update: 2025-06-04 03:00 GMT

తెలుగు రాష్ట్రాలు నేడు ఆందోళనలతో మార్మోగుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వైసీపీ "వెన్నుపోటు దినం" పేరుతో నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనను విజయవంతం చేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై... బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఆందోళనలకు పిలుపునిచ్చారు. మహాధర్నాకు తరలిరావాలంటూ కవిత బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మరోవైపు వైసీపీ పీడ విరగడనైందుకు పండుగ చేసుకుందామని ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పిలుపునిచ్చారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆందోళనల పర్వం గట్టిగానే జరిగే అవకాశం కనిపిస్తోంది.

వైసీపీ పిలుపు

నేడు ఏపీ వ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని నిర్వహించాల‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేర‌కు, ఆ పార్టీ స‌మాయ‌త్తమైంది. టీడీపీ కూటమి ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చక పోవడంతో పాటు, అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్త శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తామని వైసీపీ తెలిపింది. అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ... డీజీపీకి కూడా లేఖ రాసింది, . వైసీపీ ఘోర ప‌రాజ‌యం, కూట‌మికి ఘ‌న‌విజ‌యం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. అయితే కూట‌మి త‌న హామీల్ని నిల‌బెట్టుకోలేద‌నేది వైసీపీ ఆరోప‌ణ‌. హామీల్ని అమ‌లు చేయ‌కుండా, ప్రజ‌ల్ని వంచించారంటూ వైసీపీ నిర‌స‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. ఆ కార్యక్ర‌మానికి వెన్నుపోటు అని పేరు పెట్టారు.

జాగృతి ఆధ్వర్యంలో..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మహాధర్నా కొనసాగనుంది. గోదావరి నీళ్లను ఒడిసి పట్టి.. నెర్రెలు బారిన తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌‌కు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా నోటీసులు ఇవ్వడంపై కవిత మహాధర్నాకు పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి తలపెట్టిన మహా ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు, జాగృతి శ్రేణులు తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్‌ చేయాల్సి వచ్చింది..? కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను ఆమె వివరించనున్నారు.

జనసేన ఆధ్వర్యంలో..

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పాలనకి ఏడాది పూర్తవడంతో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనుంది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నాయకత్వంలో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన‌ ఏడాది ఉత్సవాలు చేస్తోంది జనసేన. సుపరిపాలన ప్రారంభమై ఏడాది.. పీడ విరగడై ఏడాది అంటూ, ఈ నెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుపుకోవాలని జనసేన నిర్ణయించింది.

Tags:    

Similar News