అమరావతి మహిళలను కించపరిచిన కేసులో సాక్షి ఛానల్కు చెందిన జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. అమరావతి మహిళలను కించపరిచిన కేసులో కొమ్మినేని శ్రీనివాస్ రావు, జర్నలిస్టు కృష్ణం రాజుపై... ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల క్రితం సాక్షి ఛానెల్లో జరిగిన డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణం రాజు.. అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి.
కొమ్మినేని, కృష్ణంరాజులకు బిగుస్తున్న ఉచ్చు
జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులకు ఉచ్చు బిగుస్తోంది. వీరిపై ఏపీ సర్కారు ఐటీ చట్టాన్ని ప్రయోగిస్తోంది. అలాగే SC, ST చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసి, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇక వీరిపై ఏపీ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. అన్ని ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.