SHIVARATRAI: శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు
శ్రీశైలానికి పోటెత్తిన భక్త జనసంద్రం
మహా శివరాత్రిని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలతో పాటు దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నేడు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలు 'ఓం నమఃశివాయ' నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీశైలంలో వైభవంగా మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనం నిమిత్తం పెద్దఎత్తున తరలివచ్చారు భక్తులు.
దేశవ్యాప్తంగా కూడా శైవక్షేత్రాల్లో ఇదే దృశ్యం కనిపిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాల వరకూ శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. కొందరు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణలో మునిగిపోయారు. లింగాభిషేకాలు, రుద్రపారాయణాలు, భజనలు, కీర్తనలు విస్తృతంగా జరుగుతున్నాయి. శివుని కటాక్షం కోసం వేలాది మంది భక్తులు ఆలయాలకు తరలివస్తూ ఆధ్యాత్మికతను చాటుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం క్షేత్రం భక్తులతో నిండిపోయి ఆధ్యాత్మిక కాంతిని వెదజల్లుతోంది. ఉత్సవాలు అర్ధరాత్రి వరకు వైభవంగా కొనసాగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మరుసటి రోజు కూడా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కొనసాగించనున్నట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి.
మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న ప్రధాన శైవక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచే క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం 7 గంటలకు జగద్గురు పీఠాధిపతి చేతుల మీదుగా మల్లన్నకు ప్రత్యేక అభిషేకం జరగనుంది. ఆలయ ప్రాంగణంలో నంది వాహనసేవ కార్యక్రమం భక్తులను ఆకట్టుకోనుంది. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారి ఆలయానికి పాగాలంకరణ చేయనున్నారు. ఈ సమయంలో విశేష అభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించేందుకు అర్చకులు సిద్ధమయ్యారు.