సీఎం జగన్.. నిరాధారణ ఆరోపణలతో న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేశారన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్కుమార్ యాదవ్, ఎస్కే సింగ్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. న్యాయవ్యవస్థపై నిరాధారణ ఆరోపణలు చేసిన సీఎం జగన్ను ఆ పదవి నుంచి తొలగించాలని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ తమ పిటిషన్లో కోరారు పిటీషనర్లు.
ముగ్గురు న్యాయవాదులు వేసిన పిల్పై... జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం కాసేపట్లో విచారణ చేపట్టనుంది. మరోసారి న్యాయవ్యవస్థను కించపరచకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు పిటీషనర్లు. మనీలాండరింగ్, అవినీతికి సంబంధించిన 20కిపైగా కేసుల్లో జగన్ నేరారోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం ద్వార సీఎం పదవిని దుర్వినియోగం చేశారన్నారు. ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై సీఎం జగన్ నుంచి వివరణ కోరాలని కోరారు.
ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జిలు లేదా రిటైర్డ్ జడ్జిలతో కూడిన అంతర్గత కమిటీతో న్యాయవిచారణ జరిపించాలని, లేదా పూర్తిస్థాయిలో సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు. కాసేపట్లో ధర్మాసనం ముందుకు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తే.. సీఎం జగన్కు ఇబ్బందులు తప్పవంటున్నారు న్యాయనిపుణులు.