రేపటి నుంచి కొనసాగే పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.. ఇప్పటికే రెండు విడతలుగా సాగిన వారాహి యాత్ర ..జనసేనలో ఫుల్ జోష్ నింపింది..మూడో విడత యాత్రను కూడా విజయవంతం చేసేందుకు జనసైనికులు రంగం సిద్ధం చేశారు.. ఉమ్మడి విశాఖ జిల్లాలో రేపటి నుంచి ఈనెల 19 వరకు మూడో విడత వారాహి యాత్ర నిర్వహించనున్నారు.
అందమైన విశాఖ నగరంలో వైసీపీ నేతల భూదందాలు, అరాచకాలను యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఎండగడతారని జనసేన నేతలు తెలిపారు... రుషికొండ, దసపల్లా, విస్సన్నపేట భూములను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. మూడో విడత యాత్రలో రెండు బహిరంగ సభలు, జనవాణి కార్యక్రమం ఉంటుందని చెప్పారు. రేపు సాయంత్రం జగదాంబ జంక్షన్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ఆగస్టు 15న మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జాతీయ జెండా ఎగరవేసి.. మళ్లీ తిరిగి విశాఖ జిల్లాలో యాత్ర కొనసాగిస్తారని జనసేన నేతలు తెలిపారు.