TIRUMALA: తిరుమల పరకాలమణిలో రూ.100 కోట్ల చోరీ..!
పరకామణి స్కామ్పై సీఐడీ విచారణకు ఆదేశం.. టీటీడీ మెంబర్ భానుప్రకాశ్ సంచలన ఆరోపణలు.. రూ.100 కోట్ల స్కామ్ జరిగిందన్న భానుప్రకాశ్రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పరకామణి విభాగంలో జరిగిన భారీ చోరీపై టీటీడీ సభ్యుడు భానుప్రకాష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వీడియోను విడుదల చేసిన ఆయన, పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి దోచుకున్న దృశ్యాలు అందులో ఉన్నాయని తెలిపారు. దొంగతనానికి వైసీపీ నాయకులు, అధికారుల సహకారం ఉన్నట్లు భానుప్రకాష్రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది రూపాయల విలువైన డబ్బును రియల్ ఎస్టేట్లో పెట్టుబడి చేశారని వివరించారు. ఓ దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారు.. గత వైసీపీ ప్రభుత్వ హాయంలో తిరుమల స్వామివారి పరకామణిలో వంద కోట్ల దొంగతనం చేశారని ఆరోపించారు. టీటీడీ చరిత్రలో అత్యంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగింది అని టీటీడీ సభ్యుడు భానుప్రకాష్రెడ్డి అన్నారు. " స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో కానుకలు హుండీలో వేస్తే వాటిని దోచుకున్నారు.. రూ. 100 కోట్ల పైగా పరకామణిలో దొంగతనం చేశారు.. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించింది.. వచ్చే నెల రోజుల్లో సీల్డ్ కవర్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.. దానికి సంబంధించిన బోర్డు నిర్ణయాలను ఇతర డాక్యుమెంట్లను అన్నిటిని సీజ్ చేయాలని ఆదేశించింది" అని భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కటీటీడీలోనే రూ.100 కోట్ల వరకు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డి ఉన్నారని, ఆయన ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
లోక్ అదాలత్లో రాజీ చేస్తారా..?
అప్పట్లో కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్ళారని టీటీడీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో చాలా మంది వైసీపీ ప్రముఖుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ భాగస్వామ్యలుగా ఉన్నారు, త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయన్నారు. త్వరలో ఓ అధికారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ రూ. 100 కోట్ల స్కాంకు సంబంధించిన అన్ని వివరాలను బయట పెట్టబోతున్నారు.. స్వామివారి సొత్తును కీలకమైన ఓ పోలీస్ అధికారి దోచుకోవడమే లక్ష్యంగా పని చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు అందరికి ఇందులో వాటాలు వెళ్ళాయి.. అప్పటి అధికారులు ఈ సొమ్మును పంచుకున్నారు.. ఈ కుంభకోణం జరిగినప్పుడు చైర్మన్గా ఉన్నది భూమన కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు భూమన దీనికి సమాధాన చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, దోచుకున్న సొమ్ములో కొంత తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా.. రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులోఉందన్నారు. ఒత్తిడి తెచ్చిన ఆ పోలీసు అధికారి ఎవరో ముందు తేల్చాలని భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. పరకామణిలో పెద్దజీయర్ తరఫున సి.వి.రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, కొన్నేళ్లుగా రహస్యంగా దాదాపుగా రూ. 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
"రూ.100 కోట్ల పరకా‘మనీ’ దొంగ వెనుక వైసీపీ"
వైసీపీ గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. వందకోట్ల పరకా‘మనీ’ దొంగ వెనుక ఆ పార్టీ నేతలు ఉన్నారని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. అరాచకం పెచ్చరిల్లిందని లోకేశ్ వెల్లడించారు. "తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. రూ.కోట్ల విలువైన సొత్తు కొల్లగొట్టారు. ఆ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు అందాయని నిందితులే చెబుతున్నారు." అని లోకేశ్ తెలిపారు.