TTD: శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం.. సంచలన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ;
సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించనుంది.టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. కంపార్ట్మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
గరుడ వారధిగా పేరు మార్పు
తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీనివాససేతు పేరుని గరుడ వారధిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. అలిపిరిలో దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని టీటీడీకి అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని బి.ఆర్. నాయుడు నిర్ణయించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో రాజకీయాలు మాట్లాడడంపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్లోనే జమ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. స్వామివారికి చెందిన నగదును ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్లు నుంచి ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేసేలా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
సంచలన నిర్ణయాలు
అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్ని భక్తులకు వడ్డించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ స్థలంలో పీఠం నిర్మించిన బిల్డింగ్ని కూల్చివేయాలని నిర్ణయం తీసుకుంది. టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4 వేల ఎస్ఈడీ టిక్కెట్లు రద్దు చేస్తూ టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడీ నిర్ణయంపై పవన్ హర్షం
తిరుపతి ప్రజలకు ప్రతినెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తూ టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయం తిరుపతి ప్రజలకు సంతోషాన్ని కలిగించిందని పవన్ పేర్కొన్నారు. కాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.