MEETING: మిర్చి సమస్యలపై నేడు కేంద్రం భేటీ
కృషిభవన్లో కేంద్ర వ్యవసాయమంత్రి కీలక భేటీ... చంద్రబాబు వినతితో వెంటనే కదిలిన కేంద్రం;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రతిపాదనలపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. వీటిపై చర్చించడానికి ఇవాళ ఉదయం 11 గంటలకు కృషిభవన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర ఖరారు, ఏపీ నుంచి ఎండుమిర్చి ఎగుమతులను ప్రోత్సహించడమే ప్రధాన ఎజెండాగా చర్చలు జరపబోతున్నట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. సమావేశానికి కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్, అపెడా ఛైర్మన్, ఉద్యాన గణాంకాలు, ధరల విభాగాల సలహాదార్లు, హార్టీకల్చర్ అదనపు కమిషనర్లు హాజరుకానున్నారు.
ఏం చేయాలో అన్నీ చేస్తాం
మిర్చి కొనుగోలు వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు ఎలా పంచుకోవాలి, ఎగుమతులను స్థిరీకరించడానికి ఏం చేయాలో ఆలోచించాలని కేంద్రమంత్రిని అడిగినట్లు చంద్రబాబు తెలిపారు. ఇవాళ సమావేశం పెట్టుకొని వీటన్నింటిపైనా చర్చిస్తామని, రైతును అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. తాను కూడా శనివారం ట్రేడర్స్, మార్కెట్ కమిటీలతో మాట్లాడతానని... ధరలు పడిపోకుండా, రైతులు నష్టపోకుండా ఉండటానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
మిర్చి రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు
మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో చంద్రబాబు చర్చలు జరిపారు. రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందు కీలక ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు. రైతులకు న్యాయం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల్లో ఏపీ అధిక నీటిని వాడుకుంటుందన్న తెలంగాణ ఆరోపణలు అవాస్తవమని చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన మేరకే వాడుకుంటున్నామని తేల్చి చెప్పారు. సముద్రంలో కలిసే నీటినే అదనంగా వాడుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి కరువును తరిమి కొడతామని సీఎం వెల్లడించారు.