YS Jagan : అమరావతిపై జగన్ కుట్రలు బట్టబయలు..!

Update: 2026-01-09 05:30 GMT

అమరావతి పేరు వింటే చాలు మాజీ సీఎం జగన్ తట్టుకోలేకపోతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు రాజధాని ప్రాంత ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. విజయవాడ–గుంటూరు హైవేకు ఆనుకుని రాజధాని ఉండాలన్న మాటను మళ్లీ తెరపైకి తెచ్చిన జగన్, నదీగర్భంలో అమరావతి కట్టడం అసాధ్యమంటూ మరోసారి కుట్ర సిద్ధాంతాలకు తెరలేపారు. నదీ గర్భంలో నిర్మాణాలకు అనుమతులే ఉండవని, అలాంటిది అమరావతి ఎలా కడతారంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన కుట్రలను బయటపెడుతున్నాయి. నిజానికి అమరావతి అనేది ఏ ఒక్కరి కల కాదు. వేల మంది రైతులు తమ జీవితాలను తాకట్టు పెట్టి, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను స్వచ్ఛందంగా ఇచ్చిన ఒక ప్రజల రాజధాని. అలాంటి రాజధానిపై జగన్ పదేపదే అనుమానాలు రేపేలా మాట్లాడటం వెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది ఇప్పుడు బహిరంగ చర్చగా మారింది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టారు. మూడు రాజధానుల పేరుతో అయోమయం సృష్టించి, రైతులను రోడ్డున నిలబెట్టారు. న్యాయస్థానాల్లో కేసులు, నిరసనలు, ఆందోళనలు… ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతం ఒక రకమైన నరకాన్ని అనుభవించింది. రాజధాని పేరుతో అభివృద్ధి ఆగిపోయింది, భవిష్యత్ మీద నమ్మకం కోల్పోయారు రైతులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతిని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, జగన్‌కు అది జీర్ణించుకోలేకపోతున్నారు.

రివర్ బేసిన్, నదీగర్భం అంటూ కొత్త కొత్త వాదనలను తెరపైకి తీసుకొస్తూ రాజధాని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు, ఐఐటీ నిపుణులు అమరావతి ప్రాంతంపై అధ్యయనాలు చేసి ఇది నదీగర్భం కాదని ప్లానింగ్ చేశారని గుర్తు చేస్తున్నారు. వరద నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ అన్నీ పరిగణనలోకి తీసుకునే మాస్టర్ ప్లాన్‌తోనే అమరావతి రూపకల్పన జరిగిందని చెబుతున్నారు. రాజధాని అనేది రాజకీయ లాభాల కోసం ఆడుకునే అంశం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయమని ప్రజలు అంటున్నారు. అయినా సరే జగన్ పదేపదే అమరావతిపై వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Full View

Tags:    

Similar News