AP: అందుకే ఓడిపోయా: షర్మిల

ప్రజల గుండెల్లో కాంగ్రెస్‌ స్థానం పెరుగుతోందన్న షర్మిలా.. తాను పోటీ చేస్తున్నట్లే చాలామందికి తెలీదన్న ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌...;

Update: 2024-06-20 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం జగన్, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి.. కడప ప్రజల్ని భయపెట్టారని, అందుకే కడప ఓటర్లు తనకు ఓటు వేయలేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. షర్మిలకు ఓటు వేశారని తెలిస్తే తమను ఇబ్బంది పెడతారని కడప ప్రజలు భయపడ్డారని అన్నారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వస్తే, తమకు ఎదురు తిరిగిన వారికి పథకాల్లో కోత పెడతారనే ప్రచారం కూడా జరిగిందని, అందుకే కడప ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయలేదని షర్మిల అన్నారు. పథకాలు పోతాయనే భయంతో అందరూ వైసీపీకి ఓటు వేశారన్నారు. వైసీపీ ఒక్కో ఓటుకి రూ.3,500 పంపిణీ చేసిందని, ఓటర్లను ఆ పార్టీ నేతలు ప్రలోభ పెట్టారని షర్మిల మండిపడ్డారు. ఇక తనకు టైమ్ తక్కువగా ఉండటం కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిందని షర్మిల తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను అన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చిందని, అందుకే కడపలో ఎక్కువ మంది ప్రజలకు చేరువ కాలేకపోయానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాను పోటీ చేస్తున్నట్టు కూడా చాలామందికి తెలియదని, అందుకే తాను ఓడిపోయానని చెప్పారు.ఈ ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైనా లోక్ సభ విషయంలో ఊహించని స్థాయిలో 4 సీట్లు గెలుచుకుంది. కడపలో అవినాష్ రెడ్డి టఫ్ ఫైట్ ఎదురైనా గెలిచారు. అయితే అక్కడ షర్మిల పోటీతో టీడీపీ ఓట్లు భారీగా చీలాయనే వాదన కూడా ఉంది. షర్మిల పోటీ వల్లే అవినాష్ రెడ్డి గెలిచారని టీడీపీ నేతలు అంటున్నారు

కడప లోక్ సభ నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన ఎన్నికల సమరం. కడప లోక్ సభ స్థానానికి వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీచేయగా.. ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగారు. దీంతో ఈ నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే చివరకు విజయం మాత్రం అవినాష్ రెడ్డినే వరించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇక్కడ మూడోస్థానానికి పడిపోయారు. ఇక ఆ ఓటమిపై తాజాగా స్పందించారు వైఎస్ షర్మిల. బుధవారం విలేకర్ల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన షర్మిల.. తన ఓటమిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి, అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వెల్లడించారు.

ఎన్నికల సమయంలో తాను 14 రోజులు మాత్రమే కడపలో ప్రచారం చేయగలిగానని.. మిగిలిన సమయం రాష్ట్రవ్యాప్త ప్రచారానికే సరిపోయిందన్నారు. అలాగే వైఎస్ఆర్ బిడ్డ పోటీచేస్తోందన్న విషయం గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి తెలియనేలేదని.. తన ఓటమికి ఇదే కారణమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు. మరోవైపు ఏపీ ఓటర్లు కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఒకేవైపు ఓటేశారని షర్మిల చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చకూడదనే ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేయలేదనే అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు. ఓటు వృధా కాకూడదు. ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలని అని ప్రజలు అనుకున్నారు. అదే బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేసేందుకు ప్రజలు ఆలోచించారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో చోటు సంపాందించుకోవటం మొదలుపెట్టింది. ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మేమంతా కష్టపడి పనిచేస్తాం. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. 2029కల్లా మంచి స్థానానికి వస్తామనే నమ్మకం ఉంది." అని వైఎస్ షర్మిల అన్నారు.

Tags:    

Similar News