చిరంజీవి మళ్లీ పుట్టాడు.. ఆమె కోరిక నెరవేరింది

నీ కడుపులో బిడ్డనై.. నీ కంటి పాపనై మళ్లీ వస్తాను.. నీ కన్నీళ్లు తుడుస్తాను

Update: 2020-10-22 09:58 GMT

'నిన్ను ఒంటరిగా వదిలి వెళుతున్నానని నన్నే తల్చుకుంటూ కుమిలిపోకు.. నీ కడుపులో బిడ్డనై.. నీ కంటి పాపనై మళ్లీ వస్తాను.. నీ కన్నీళ్లు తుడుస్తాను 'అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన కన్నడ నటుడు చిరంజీవి సర్జా.. మళ్లీ జన్మించాడు.. తన ప్రియాతి ప్రియమైన భార్య ఒడిలో బిడ్డగా ఒదిగిపోయాడు. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకర వార్తను చిరంజీవి తమ్ముడు హీరో ధ్రువ సర్జా గురువారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

మగబిడ్డ.. జై హనుమాన్ అని పోస్ట్ చేశారు. నటుడు అర్జున్ మేనల్డుడైన చిరంజీవి సర్జా ఈ ఏడాది జూన్ 7న గుండెపోటుతో మరణించారు. 36 ఏళ్ల చిరంజీవి మరణించేనాటికి ఆయన భార్య మేఘన గర్భవతి. ఇప్పుడు ఆమె మగబిడ్డకు జన్మనివ్వడంతో చిరంజీవి మళ్లీ పుట్టాడని అభిమానులు సంబరపడుతున్నారు.

భర్త మరణానంతరం అతడి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మేఘన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'నా ఊపిరి ఉన్నంతవరకు నువ్వు బతికే ఉంటావు.. నువ్వు నాలోనే ఉన్నావు. ఐ లవ్ యు'.. అంటూ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేశారు. 'నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తావు. అందుకే నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లావు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకు గుర్తు. ఇది నువ్వు నాకిచ్చిన అపురూపమైన బహుమతి. ఇందుకు నేను నీకు ఎంతో రుణపడి ఉంటాను.

నిన్ను మళ్లీ భూమిపైకి తీసుకురావడానికి, నిన్ను ఎత్తుకోవడానికి, నీ చిరునవ్వును చూడడానికి, నీ నవ్వును మళ్లీ వినడానికి వేచి చూస్తున్నాను' అని మేఘన తన సందేశంలో పేర్కొన్నారు. ఆమె కోరిక నెరవేరింది. ఆమె కల నిజమైంది. చిన్నారి సర్జా ఆమె పొత్తిళ్లలో వెచ్చగా అమ్మని హత్తుకుని, ఆమె ప్రేమని ఆస్వాదిస్తున్నాడు. 

Tags:    

Similar News