CEMENT: పెరగనున్న సిమెంట్ ధరలు!
4 శాతం పెరిగే అవకాశం.. భారం కానున్న నిర్మాణ వ్యయం;
ఈ ఏడాది దేశీయ మార్కెట్లో సిమెంట్ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సిమెంట్ ధరలు 2 నుంచి 4 శాతం (రూ.15-20) మేరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ, విశ్లేషణ సంస్థ క్రిసిల్ తాజా రిపోర్టులో అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ, గ్రామీణ హౌసింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు 10 శాతం పెంచిన నేపథ్యంలో సిమెంట్ రంగంలో డిమాండ్ 6.5-7.5 శాతం పెరుగుతుందని క్రిసిల్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులతో పాటు ఈ ఏడాది రుతుపవనాలు సానుకూలంగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు స్పీడ్ అందుకుంటాయని, తద్వారా సిమెంట్ రంగంలో గిరాకీ ఊపందుకుంటుందని క్రిసిల్ తన ఇంటిలిజెన్స్ నివేదికలో వెల్లడించింది.
గతేడాది నిరాశపరిచిన ఇండస్ట్రీ
గత ఆర్థిక సంవత్సరం (2024-25)సిమెంట్ ఇండస్ట్రీకి అంతగా కలిసిరాలేదు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే సిమెంట్ పరిశ్రమలో వృద్ధిరేటు 4.5-5.5 శాతంగానే కొనసాగింది. దీనిని లోక్సభ ఎన్నికలు, భారీ వర్షాలు కారణమని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఒక దశలో ప్రముఖ కంపెనీల 50 కిలోల సిమెంట్ బస్తా రూ.300కి కూడా పడిపోయింది. ప్రసుతం కోలుకుని రూ.350 నుంచి రూ.360 మధ్య ట్రేడవుతోంది. ప్రధానంగా ప్రధానమైన 12 రాష్ట్రాలు ప్రకటించిన తమ బడ్జెట్ల కారణంగా దేశీయ సిమెంట్ డిమాండ్లో 63.65 శాతం భర్తీ చేయనున్నాయి. ఇది సిమెంట్ రంగానికి సానుకూలమని, గిరాకీ పుంజుకునేందుకు దోహదపడుతుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సెహుల్ భట్ చెప్పారు.
రోడ్లు, రైల్వే నిర్మాణాలు వేగవంతం
దేశీయంగా సిమెంట్ రంగానికి డిమాండ్లో 30 శాతం మేర వాటా కలిగిన మౌలిక సదుపాయాల రంగంలో కేంద్ర ప్రభుత్వం రోడ్లతో పాటు రైల్వే నిర్మాణాలను వేగవంతం చేసింది. ఆ తర్వాత రైల్వేలు, నీటి పారుదల, పట్టణ మౌలిక సదుపాయాలు ఎక్కువ సిమెంట్ వినియోగం కలిగి ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు, ఇటీవల కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం మెరుగుపడుతుందని అంచనా వేస్తుంది. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, ఉపాధి హామీ చట్టం పథకాలు సైతం సిమెంట్ ఇండస్ట్రీకి బాగా కలిసొస్తుందని క్రిసిల్ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే నిర్మించిన ఇండ్లు అమ్ముడుపోక, కొత్త ప్రాజెక్టులపై రియల్టర్లు పెద్దగా ఆసక్తి చూపట్లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి.