bike taxi: ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలకు గుడ్న్యూస్
పీక్ అవర్స్లో ఛార్జీలు పెంచుకునే అవకాశం.. త్వరలో కొత్త మార్గదర్శకాలు అమలు... క్యాన్సిల్ చేస్తే ఛార్జీలో 10శాతం పెనాల్టీ;
ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి సంస్థలకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. క్యాబ్ సంస్థలు పీక్ అవర్స్లో తమ ఛార్జీలను గరిష్ఠంగా 2 రెట్లు వరకు పెంచుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇప్పటివరకు ఈ సర్జ్ ప్రైసింగ్ గరిష్ఠ పరిమితి 1.5 రెట్లు వరకు ఉండేది. దీన్ని తాజాగా 0.5 రెట్లు పెంచింది. రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
రద్దీ సమయంలో 200శాతం పెంపు
జూలై 1న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. నామమాత్రంగా రద్దీ ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీల్లో సగం సర్ఛార్జీ కింద పెంచుకునేందుకు వీలు కల్పించింది. అలాగే ఒకవేళ రద్దీ విపరీతంగా ఉంటే 200 శాతం పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అంతకుముందు ఈ వెలుసుబాటు 150 శాతంగా ఉండేది. ఇక, మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకూడదని షరతు విధించింది. మరోవైపు యాప్ ద్వారా రైడ్ను అంగీకరించిన తర్వాత సరైన కారణం చెప్పకుండా డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే.. ఛార్జీలో 10 శాతం పెనాల్టీ (రూ.100 మించకుండా) పడుతుంది. దానిని డ్రైవర్, అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ (ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు) చెరి సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన కారణం చెప్పకుండా రైడ్ క్యాన్సిల్ చేసినా ఇదే పెనాల్టీ వర్తిస్తుంది.
క్యాబ్ డ్రైవర్ల సంక్షేమంపై ఫోకస్
డ్రైవర్ల సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెంచింది. ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్ సంస్థల కింద సేవలు అందించే వాహనాలకు వెహికిల్ లొకేషన్, ట్రాకింగ్ పరికరాలు తప్పనిసరిగా అమర్చాలని స్పష్టం చేసింది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లకు అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఈ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లతో అనుబంధంగా ఉన్న ప్రతి డ్రైవర్కు కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ను ఆ క్యాబ్ సంస్థలు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్యాసింజర్ రైడ్స్ కోసం ప్రైవేట్ మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతించింది.
కర్ణాటకలో బైక్ ట్యాక్సీల నిలిపివేత
ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా బైక్ ట్యాక్సీలు నిలిచిపోయాయి. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సేవలను నిలిపివేయాలంటే కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 వరకు గడువు ఇచ్చింది. ఈ అంశంపై క్యాబ్ సర్వీసు సంస్థలు సవాల్ చేయగా.. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది. దాంతో వాటి సేవలు నిలిచిపోయాయి. బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్వర్కర్ల జీవితాలు రోడ్డునపడతాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ మోటార్ సైకిళ్లను ఉపయోగించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఆటోలు, బైక్ ట్యాక్సీలు, సహా ఇతర వాహనాలకు బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు అందించింది. ఒకవేళ రాష్ట్రాలు బేస్ ఛార్జీలను అధికారికంగా నోటిఫై చేయకపోతే.. ఆ ధరలను ప్రకటించే బాధ్యత అగ్రిగేటర్లదేనని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు ఈ చర్యను స్వాగతిస్తున్నారు.