GOOGLE: కొత్త పాలసీ.. ఆఫీసుకు వెళ్లని టెక్కీల జాబ్స్ గల్లంతే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం;
కరోనా విజృంభించిన సమయంలో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫర్ చేశాయి. తర్వాత కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి దశల వారీగా ముగింపు పలుకుతున్నాయి. తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించటానికి పలు కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం వ్యాపార అవసరాలు, బిజినెస్ వాతావరణంలో అనేక కంపెనీలు కొన్ని త్రైమాసికాలుగా తమ ఉద్యోగులను మెల్లమెల్లగా తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఈ విషయంలో ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
గూగుల్ కీలక నిర్ణయం
తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిందేనంటూ కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని తీసుకొచ్చింది. దీనిని కంపెనీలోని కోర్, మార్కెటింగ్, రీసెర్చ్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మెషన్, కమ్యూనికేషన్ టీమ్స్ కి పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో గూగుల్ సెర్చ్, కామర్స్, యార్డ్స్ వంటి డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు సైతం కొత్త పాలసీ కిందకు వస్తారని పేర్కొంది. కొత్త పాలసీ కింద ప్రస్తుతం ఆఫీసుకు 50 మైళ్ల దూరంలో ఉంటూ రిమోట్ వర్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులు ఇకపై హైబ్రిడ్ షెడ్యూల్ కిందకు మారాల్సి ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీని కింద ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజుల పాటు తమ ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుంది.
కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీ
2022లోనే హైబ్రిడ్ వర్క్ విధానం కోసం గూగుల్ తన ఉద్యోగులకు పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో కొత్త వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాలసీని ఫాలో అవ్వాలనుకోని ఉద్యోగులు వారంతటగా వారే కంపెనీని వీడేందుకు సైతం గూగుల్ అవకాశం కల్పిస్తున్నట్లు అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన మెమో చెబుతోంది. దీని కింద వెళ్లిపోవాలని తలచిన ఉద్యోగులకు సివరెన్స్ పే చెల్లించబడుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ పాలసీ కంపెనీ పనితీరును మెరుగుపరిచినట్లు ఒక అధికారి వెల్లడించారు.