MG Motors : ఫార్చ్యూనర్ కోటపై ఎంజీ మెజెస్టర్ దండయాత్ర.. సరికొత్త ఎస్యూవీలతో మార్కెట్లోకి ఎంజీ, జెటూర్.
MG Motors : ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై 7-సీటర్ ప్రీమియం ఎస్యూవీ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు టయోటా ఫార్చ్యూనర్. 2009 నుంచి ఈ సెగ్మెంట్లో రారాజుగా వెలుగుతున్న ఫార్చ్యూనర్ కోటను బద్దలు కొట్టేందుకు ఇప్పుడు రెండు కొత్త దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. JSW MG మోటార్, చెర్రీ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి ఎంజీ మెజెస్టర్, జెటూర్ టీ2 అనే రెండు పవర్ఫుల్ ఎస్యూవీలను రంగంలోకి దించుతున్నాయి. 2026లో ఈ కార్ల రాకతో ఎస్యూవీ మార్కెట్లో అసలైన యుద్ధం మొదలుకానుంది.
ఎస్యూవీ విభాగంలో ఎంజీ మోటార్ నుంచి వస్తున్న భారీ ఆయుధం మెజెస్టర్. ఇది ఏప్రిల్ 20, 2026న గ్రాండ్ గా లాంచ్ కానుంది. దీని డెలివరీలు మే నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఈ కారులో 2.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ను అమర్చారు, ఇది 215 bhp పవర్, 478 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6, 7 సీట్ల వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఆఫ్రోడింగ్ కోసం ఇందులో ప్రత్యేకంగా ఎం-హబ్ అనే టెర్రైన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. దీని ధర సుమారు రూ.40 లక్షల నుంచి 45 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.
చెర్రీ ఇంటర్నేషనల్ బ్రాండ్ కింద వస్తున్న జెటూర్ టీ2 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రైన్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 26.7 kWh బ్యాటరీ ఉంటాయి. ఇది ఏకంగా 381 bhp పవర్, 610 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్లోనే ఇది 139 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. పెట్రోల్, బ్యాటరీ కలిపితే దీని రేంజ్ 1,000 కిలోమీటర్లు దాటడం విశేషం. ఇది సెప్టెంబర్ 2026 నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.38 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉండవచ్చు.
ప్రస్తుతం మార్కెట్లో ఒక వెలుగు వెలుగుతున్న టయోటా ఫార్చ్యూనర్కు ఈ రెండు కార్లు గట్టి సవాలు విసరబోతున్నాయి. ఫార్చ్యూనర్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్, రీసేల్ వాల్యూను తట్టుకోవాలంటే ఎంజీ, జెటూర్ సంస్థలు ఫీచర్లు, ధర విషయంలో రాజీ పడకూడదు. మెజెస్టర్ తన పవర్ఫుల్ డీజిల్ ఇంజిన్తో, టీ2 తన అద్భుతమైన హైబ్రిడ్ రేంజ్తో కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), లగ్జరీ ఇంటీరియర్స్, పవర్ఫుల్ ఆఫ్రోడ్ సామర్థ్యాలు ఈ కొత్త కార్లకు ప్లస్ పాయింట్ కానున్నాయి.
భారతీయ వినియోగదారులు ఇప్పుడు కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, కంఫర్ట్కు కూడా పెద్దపీట వేస్తున్నారు. ఫార్చ్యూనర్లో లీటర్ల కొద్దీ పెట్రోల్/డీజిల్ ఖర్చవుతుందని భావించే వారికి జెటూర్ టీ2 హైబ్రిడ్ ఆప్షన్ గొప్ప వరంగా మారుతుంది. అదేవిధంగా మరింత టెక్నాలజీ, విలాసం కోరుకునే వారికి ఎంజీ మెజెస్టర్ సరైన ఎంపిక. ఏది ఏమైనా 2026లో ఈ రెండు దిగ్గజాల రాకతో ఎస్యూవీ సెగ్మెంట్లో కస్టమర్లకు మరిన్ని ఆప్షన్లు దొరకనున్నాయి.