Crude Oil Price: చమురు ధరలను తగ్గించే ప్రయత్నంలో ప్రభుత్వం..
Crude Oil Price: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంధన ధరలు సెంచరీ ధాటాయి.
Crude Oil Price: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంధన ధరలు సెంచరీ ధాటాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే.. దేశంలోని వ్యూహాత్మక ముడి చమరు నిల్వలు.. ఐదు మిలియన్ల బ్యారెళ్ల క్రూడాయిల్ను వినియోగంలోకి తేవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, భారత్ చరిత్రలో తన ఎమర్జెన్సీ నిల్వలను తొలిసారి విడుదల చేసినట్లవుతుంది.
ఈ నిర్ణయం వారం రోజుల్లో అమలులోకి రానున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈస్ట్, వెస్ట్ కోస్తా ప్రాంతాల్లో మూడు చోట్ల అండర్గ్రౌండ్ కేంద్రాల్లో 5.33 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. విశాఖలో 1.33 మిలియన్ టన్నుల సామర్థ్యం, కర్ణాటకలోని మంగళూరులో 1.5 మిలియన్ టన్నుల, పాదూరులో 2.5 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వ చేయడానికి స్ట్రాటర్జిక్ రిజర్వులు కేంద్రం నిర్మించింది.
ఈ కేంద్రాల నుంచి 7-10 రోజుల్లో 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ నిల్వలు కేంద్రం విడుదల చేయనున్నది. ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్ వంటి అతిపెద్ద దేశాలు చమురు ధరలను తగ్గించేందుకు.. ఈవ్యూహన్ని అములపరుస్తున్నాయి.
అమెరికా, ఇతర మిత్ర పక్షాలతో కలిసి అంతర్జాతీయ ముడి చమురు ధరలను తగ్గించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో క్రూడ్ ధరను నియంత్రించడానికి భారత్, దాని మిత్ర దేశాలు మరికొంత మొత్తం చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన ధరలను తగ్గించాలని గతవారం చైనా, భారత్, జపాన్లను అమెరికా కోరింది.
ఈ విషయమై సమన్వయంతో వ్యవహరించాలని అమెరికా విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం రిజర్వు చమురు నిల్వలను విడుదల చేయాలని అభ్యర్థించింది. చమురు ఉత్పత్తి పెంచి ధర తగ్గించాలన్న అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో ఇప్పటికే సౌదీ అరేబియా నుంచి భారత్ చమురు దిగుమతి తగ్గించింది. ఇతర చమురు ఉత్పత్తి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. సౌదీ అరేబియా సారధ్యం వహిస్తున్న ఒపెక్.. వచ్చే త్రైమాసికం వరకు ముడి చమురు ఉత్పత్తిలో కోత కొనసాగించాలని నిర్ణయించింది.
గ్లోబల్ ఎకానమీ రికవరీని ముడి చమురు ధరలు దెబ్బతీస్తాయని కేంద్ర చమురుశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతవారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇతరదేశాలతో కలిసి వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయనున్నామని ప్రకటించారు. దీనిపై అమెరికా నిర్ణయంపై ఆధారపడి సూత్రప్రాయ ప్రకటన చేస్తామని అన్నారు.