TATA: విమాన ప్రమాద బాధితుల కోసం ట్రస్ట్
అహ్మదాబాద్లో ఎయిరిండియా ప్రమాదం.. బాధితుల కోసం టాటా గ్రూప్ ట్రస్ట్ ఏర్పాటు;
అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా తోడుగా ఉండేందుకు, ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి బోర్డు అనుమతి కోరినట్టు తెలుస్తోంది. ఈ ట్రస్ట్ ఏర్పాటుకు రూ.500 కోట్లను కేటాయించేందుకు అనుమతి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈనెల 12న ఈ విషాద ఘటన జరిగిన అనంతరం గురువారం నిర్వహించిన తొలి బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తీసుకొచ్చారు.
ఈ ట్రస్ట్కు కేటాయించే రూ.500 కోట్ల నిధుల ద్వారా ప్రమాదంలో మృతి చెందిన 271 మందికి చెందిన కుటుంబాలకు పరిహారాన్ని అందజేయనున్నారు. అలాగే క్షతగాత్రుల చికిత్స ఖర్చులు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీ పునరుద్ధరణ, అలాగే విమాన శకలాల వల్ల దెబ్బతిన్న భవనాలను పునర్నిర్మించటం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిగిలిన నిధులను బాధిత కుటుంబాల భవిష్యత్ అవసరాల కోసం వినియోగించాలనే టాటా సంస్థ భావించింది. ఈ ట్రస్ట్ను త్వరలోనే అధికారికంగా నమోదు చేసి, దేశవిదేశాల్లో ఉన్న బాధితుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
రెండు వేర్వేరు ట్రస్ట్లు
వాస్తవానికి టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ రెండు వేర్వేరు ట్రస్ట్లను ఏర్పాటు చేయాలని భావించింది. వీటిల్లో ఒకటి భారతీయ బాధితుల కుటుంబాలను చూసుకొనేందుకు కాగా.. మరొకొటి విదేశీ బాధితుల కుటుంబాల కోసం ఏర్పాటు చేయాలని ఆలోచించింది. ఈట్రస్ట్ బాధ్యతను టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పీబీ బాలాజీ చేపట్టనున్నారు. ఆయనకు నియంత్రణ సంస్థలు, ఫైనాన్షియల్, కార్పొరేట్ గవర్నెన్స్లో మంచి అనుభవం ఉంది.
ఈ విమాన దుర్ఘటనను టాటా సంస్థ చాలా సీరియస్గా తీసుకుంది. ఎయిరిండియా రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను నేరుగా టాటాసన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన చేతుల్లోకి తీసుకొన్నట్లు తెలుస్తోనంది. ప్రభుత్వంతో సంబంధాలు, ప్రయాణికుల భద్రతను అంచనా వేయడం, విమానాల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం వంటివి ఆయన పరిధిలోకి రానున్నాయి.