Preetisheel Singh D'Souza: స్టైలిష్ స్టార్ 'పుష్పరాజ్' ఎలా అయ్యాడు.. ఎవరు మేకప్ చేశారు..
Preetisheel Singh D'Souza: అల్లు అర్జున్ లుక్కి సంబంధించిన క్రెడిట్ అంతా మేకప్ ఆర్టిస్ట్ ప్రొస్తెటిక్ లుక్ డిజైనర్ ప్రీతీషీల్ సింగ్ డిసౌజాకి చెందుతుంది.;
Preetisheel Singh D'Souza: అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ బ్లాక్బస్టర్ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను బద్దలు కొట్టింది. . 2021లో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఓ డిఫరెంట్ లుక్లో కనిపించడానికి కారణం.. అతడి కష్టం, ఆమె మేకప్. ప్రీతీషీల్ ఆమె బృందం కలిసి అల్లు అర్జున్ లుక్ని మార్చేశారు. సినిమాలోని పుష్పరాజ్ పాత్ర కోసం మేకప్, ప్రొస్తెటిక్ చేయించుకోవలసి వచ్చింది. కనుబొమ్మలు, గిరజాల జుట్టుతో పాటు చర్మపు రంగును కూడా మార్చుకున్నాడు.
అల్లు అర్జున్తో పనిచేసిన అనుభవం గురించి ఆమె మాట్లాడుతూ.. "ఇది సౌత్లో పని చేసిన నా మొదటి చిత్రం. అల్లు అర్జున్ మేకప్ కోసం గంటల తరబడి కుర్చీలో కూర్చునేవాడు. ఒక్కోసారి పూర్తి శరీరానికి మేకప్ చేయవలసి వచ్చేది." అని వివరించారు ప్రీతిషీల్.
"పాత్ర పట్ల తనకున్న అంకితభావాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అతనితో పని చేయడం ఓ అద్భుతం. ఏం చేసైనా ప్రేక్షకులను మెప్పించాలి అదే అతడి టార్గెట్. తెరపైకి వచ్చిన మరు క్షణం పూర్తిగా తన పాత్రలో మునిగిపోతాడు. తెరపైన అతడు కనిపించడానే మీకు కూడా అతడిని తప్ప మరెవ్వరినీ చూడాలని అనిపించదు. అన్ని గంటలు కూర్చుని ఓపికతో మేకప్ చేయించుకున్న తీరు ప్రశంసనీయం. ఆర్టిస్ట్ కోపరేషన్ ఉంటే టెక్నీషియన్ పని చాలా సులభం అవుతుంది. అల్లు అర్జున్ మేకప్కు సంబంధించిన వీడియోను ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది వైరల్గా మారింది.
2017లో విడుదలైన అత్యంత ఉత్తేజకరమైన బాలీవుడ్ చిత్రాలలో పద్మావతి ఒకటి. రణ్వీర్ సింగ్ లుక్ చాలా సంచలనం సృష్టించింది. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోషించిన రణ్వీర్ భీకరంగా కనిపించాడు. ఈ రూపాన్ని భారతీయ సినిమాల్లో అత్యంత నైపుణ్యం కలిగిన ప్రొస్తెటిక్ ఆర్టిస్ట్ - ప్రీతీషీల్ సింగ్ చేశారు.
ప్రీతీషీల్ సింగ్ బాలీవుడ్ పరిశ్రమలో ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్. బాజీరావ్ మస్తానీ, హైదర్, బ్రదర్స్, మామ్, తల్వార్, శివాయ్, రంగూన్ వంటి చిత్రాలలో ఆమె మేకప్ పనితనం అద్భుతంగా ఉంటుంది.
బాలీవుడ్ బ్లాక్బస్టర్ పద్మావత్. ఈ పీరియాడికల్ డ్రామాలో దీపికా పదుకొణె మైండ్ బ్లోయింగ్ లుక్ వెనుక ప్రీతీషీల్ టాలెంటె ఉంది. పద్మావత్ 12వ శతాబ్దానికి సంబంధించిన కథ. ఆ యుగానికి చెందిన పెయింటింగ్లు కూడా అక్కడ లేవు. అయినప్పటికీ ఆమె తన పాత్రకు సరైన న్యాయం చేయడం కోసం చాలా కష్టపడింది.
పఠాన్కోట్లో పుట్టి పెరిగిన ప్రీతీషీల్ పంజాబ్లోని ఆదేశ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇన్స్ట్రుమెంటేషన్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ చదివినా తన మనసంతా మేకప్పైనే ఉండేది. ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన కెరీర్ను ప్రారంభించి ఒక సంవత్సరం పనిచేసింది. కంపెనీ ఆమెను మూడు సంవత్సరాల పాటు యునైటెడ్ స్టేట్స్కి పంపింది. అక్కడే తన మేకప్ అభిరుచికి మెరుగులు దిద్దింది.
లాస్ ఏంజెల్స్లో మేకప్, ప్రోస్తేటిక్స్ కోర్సును అభ్యసించింది. మూడేళ్లుగా లాస్ ఏంజెల్స్లో ఉన్న ప్రీతీషీల్ సింగ్ భారత్కు తిరిగి వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరిగింది. కొన్ని నెలల కష్టాల తర్వాత, దర్శకుడు పన్ను ఆమెకు అవకాశం ఇచ్చారు. మొదటి ప్రాజెక్ట్ నానక్ షా ఫకీర్. ఆమె తనను తాను నిరూపించుకునేందుకు వచ్చిన మొదటి అవకాశం. నటులు ఆదిల్ హుస్సేన్, టామ్ ఆల్టర్, ఆరిఫ్ జకారియా. వారికి ప్రోస్తేటిక్స్ చేయడానికి ఐదు నుండి ఆరు గంటలు పట్టేది.
ప్రతి రోజు ఏడు గంటలకు షూటింగ్ మొదలు పెడితే ప్రీతీ తెల్లవారుజామున మూడు గంటలకు షూట్ లొకేషన్లో ఉండాల్సి వచ్చింది. నానక్ షా ఫకీర్లో విజయం సాధించిన తర్వాత, అమె పేరు మార్మోగిపోయింది. మొదటి చిత్రమే పెద్ద సక్సెస్.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ప్రీతీషీల్ సింగ్కి పనిపట్ల చాలా అంకితభావం. స్క్రిప్ట్లను చదవడం, దర్శకుడితో చర్చించడం, పాత్ర కోసం పరిశోధనలు చేయడం ఆమెకు పనిపట్ల ఉన్న ప్యాషన్ని తెలియజేస్తుంది. అదే ఈరోజు ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టింది.