కాంతార బ్లాక్ బస్టర్ తో ఆ టీమ్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. అందుకే కాంతారకు ప్రీక్వెల్ మొదలుపెట్టారు. కాంతార చాప్టర్ 1 అంటూ స్టార్ అయిన ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి అనేక అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. ప్రకృతి కోపం నుంచి ప్రాణాలు పోవడం వరకూ చూస్తుందా మూవీ టీమ్. ఈ మధ్యనే షూటింగ్ గ్యాప్ లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి ఓ జూనియర్ ఆర్టిస్ట్ మరణించాడు. తాజాగా మరో నటుడు చనిపోవడం ఆ టీమ్ కు మరో షాకింగ్ ఇన్సిడెంట్ గా మారింది.
కాంతార 1 షూటింగ్ జరుగుతుండగా.. కేరళకు చెందిన విజు వి.కే అనే ఆర్టిస్ట్ హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయి మరణించాడు. దీంతో యూనిట్ అంతా విషాదంలో మునిగిపోయింది. దారుణం ఏంటంటే.. కేవలం ఈ రెండు నెలల కాలంలో ఈ మూవీకి సంబంధించి ఇది మూడో మరణం. మే 6న క్రూ మెంబర్ అయిన ఎమ్.ఎఫ్ కపిల్ కొల్లూరు దగ్గరలోని శూర్పణక నదిలో మునిగి చనిపోయాడు.
మే 12న రాకేష్ పూజారి అనే కమెడియన్ ఓ పెళ్లికి అటెండ్ అయిన సందర్భంలో హార్ట్ ఎటాక్ తో మరణించాడు. ఇప్పుడు వి.కే విజు కూడా హార్ట్ ఎటాక్ తోనే చనిపోయాడు.
ఇక షూటింగ్ సందర్భంగా కొన్నాళ్ల క్రితం అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. ఏదేమైనా ఈ ఘటనలన్నీ ప్రస్తుతం శాండల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇవన్నీ యథాలాపంగా జరుగుతున్నాయా లేక ఏదైనా లోపం వల్ల జరుగుతున్నాయా అనే చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది దైవ భక్తికి సంబంధించిన కథ కూడా కదా. అందుకే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కన్నడ జనం. మరి వీటిపై హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.