Asha Bhosle: మూగబోయిన గంధర్వగానం- ఆశా భోంస్లే ఇకలేరు
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల సంతాపం
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఇకలేరు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆమె కుమారుడు ఆనంద్ బోంస్లే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. తన తల్లి అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబయిలోని శివాజీ పార్క్లో నిర్వహిస్తామని తెలిపారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా ఆశా భోంస్లేను కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఆశా భోంస్లే మృతి పట్ల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. 1933లో ఆశా భోంస్లే జన్మించారు. గాయనిగా సుదీర్ఘ ప్రయాణం ఆమెది. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించారు. చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని కృషికిగానూ పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా బిభూషన్ అవార్డులు ఆమెను వరించాయి.
లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరిగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే, ప్రారంభంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమించారు. 1943లో ‘మాఝా బాళ్’ అనే మరాఠీ సినిమాతో మొదలైన ఆమె ప్రస్థానం, 1950వ దశకంలో బాలీవుడ్ వైపు మళ్లింది. 1952లో వచ్చిన ‘సంగ్దిల్’ సినిమాతో ఆమె గొంతు దేశవ్యాప్తంగా వినబడటం మొదలైంది. ‘పరిణీత’, ‘బూట్ పాలిష్’ వంటి చిత్రాలు ఆమెను అగ్ర దర్శకుల దృష్టిలో పడేలా చేశాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్తో ఆమె చేసిన ప్రయోగాలు ఒక ట్రెండ్ను సెట్ చేశాయి.
కేవలం మెలోడీలే కాకుండా, క్యాబరే సాంగ్స్, క్లబ్ డ్యాన్స్ నంబర్లను సైతం అంత హుందాగా పాడటం ఆమెకే సాధ్యమైంది. మొహమ్మద్ రఫీతో కలిసి ఆమె పాడిన “మాంగ్ కే సాథ్ తుమ్హారా,” “సాథీ హాత్ బధానా” వంటి పాటలు నేటికీ ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచిపోయాయి. ఇక ఆశా భోస్లేకి తెలుగు భాషతో విడదీయలేని అనుబంధం ఉంది. ‘మాయాబజార్’ వంటి క్లాసిక్ సినిమాల నుంచి మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాల వరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడారు. “వస్తాడు నా రాజు..” వంటి మధుర గీతాలు నేటికీ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.