విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ‘దండోరా’ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో శివాజీతో పాటుగా నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా నటుడు శివాజీ మీడియాతో ముచ్చటించారు. చిత్రం గురించి ఆయన చెప్పిన సంగతులివే..
‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’ కథ విన్నారా?
ముందుగా ‘దండోరా’ కథను విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ముందే ‘దండోరా’ మేకర్లు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ప్రొడక్షన్ పరంగా ఆలస్యమైంది. అలా ‘కోర్ట్’ ముందుగా రిలీజ్ అయింది.
‘దండోరా’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
‘దండోరా’ చిత్రంలో నా పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను. అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుంది.
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం అనుకోవచ్చా?
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. ‘దండోరా’ మాత్రం అద్భుతమైన సినిమా. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే చిత్రమిది.
‘కోర్ట్’ నుంచి తరువాత వస్తున్న చిత్రం కాబట్టి ‘దండోరా’పై సహజంగానే అంచనాలు ఉంటాయి. మరి వాటికి తగ్గట్టుగానే మీ పాత్ర ఉంటుందా?
‘కోర్ట్’ మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని పాత్రకి కూడా వస్తుంది. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్తో ఎమోషనల్గా సాగే చిత్రమిది.
‘వేదం’, ‘కంచెరపాలెం’ చిత్రంలోనూ వేశ్య పాత్రల్ని చూపించారు. ఇందులో ఎలా చూపించబోతోన్నారు?
‘దండోరా’ చిత్రంలో బిందు మాధవి గారి పాత్రను చాలా క్లాసీగా చూపించారు. ప్రతీ ఒక్కరూ సినిమాతో, పాత్రలతో కనెక్ట్ అవుతారు.
మిమ్మల్ని కొత్త దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నట్టుగా ఉన్నారు?
నేను దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నాను. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఎంతో పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారు. ఇందులో నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన ఆర్టిస్టులే. ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. ఇదే శివాజీ 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇది వరకు ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించాను. కానీ మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమో.
‘మిస్సమ్మ’లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేశారా? ‘కోర్ట్’, ‘డండోరా’ లాంటి చిత్రాల్ని ఎంజాయ్ చేస్తారా?
‘మిస్సమ్మ’, ‘శైలజా కృష్ణమూర్తి’, ‘అదిరిందయ్య చంద్రం’ ఇలా అన్ని రకాల చిత్రాల్ని ఎంజాయ్ చేశాను. అయితే నటుడిగా నా మీద నాకు నమ్మకం ఉండేది. కామెడీ, నెగెటివ్ షేడ్స్ ఇలా అన్ని రకాల పాత్రల్ని పోషించగలను. ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చిందేమో. అలా అని ప్రస్తుతం అన్నీ ఒకే రకమైన పాత్రల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు.
‘దండోరా’ తరువాత మీ నుంచి రాబోతోన్న చిత్రాల గురించి చెప్పండి?
‘దండోరా’ తరువాత నా నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉండబోతోంది. ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ‘ఎపిక్’ ఉంటుంది.