BJP Nadda : నితిన్తో భేటి కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
BJP Nadda : బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతోంది. తెలుగు హీరోలతో బిజెపి వరుస భేటీలు జరుపుతోంది.;
BJP Nadda : బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతోంది. తెలుగు హీరోలతో బిజెపి వరుస భేటీలు జరుపుతోంది. మొన్న మునుగోడుకు వచ్చిన అమిత్షా ఎన్టీఆర్ను కలిశారు. ఇవాళ వరంగల్ వస్తున్న నడ్డా హీరో నితిన్తో సమావేశం కానున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సినీ నటుడు నితిన్ ఆయనతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. నితిన్తో పాటు సినీ ప్రముఖులు, రచయితలు నడ్డాను కలుసుకోనున్నారు. అలాగే క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కూడా నడ్డాతో సమావేశం కానున్నారు. మాజీ క్రికెట్ర్ మిథాలీరాజ్ కూడా ఇవాళ భేటీ కానున్నారు.
సాయంత్రం 5.55కు జేపీ నడ్డా వరంగల్ నుంచి శంషాబాద్ నోవాటెల్కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు హీరో నితిన్, మిథాల్ రాజ్తో భేటీ కానున్నారు. అయితే నితిన్తో భేటికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్ను రాజకీయాల్లోకి రావాలని జేపీ నడ్డా ఆహ్వానించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోన్న కమలనాథులు తెలుగునాట సినిమాకున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని పావులు కదుపుతున్నారు. అందుకే వారితో వరుసగా సమావేశాలై వారి ఫ్యాన్స్ తో కూడా బీజేపీకి జై కొట్టించుకునే పనిలో పడ్డారు. సినీ రంగంలో ఉన్న ప్రముఖులను ప్రచారానికి ఉపయోగించడంతో పాటు ఆసక్తి ఉన్నవారికి టికెట్లు కూడా ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
మొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే ఎన్టీఆర్తో సమావేశమయ్యారు. భేటీ మర్యాదపూర్వకమే అని చెబుతున్నా రాజకీయపరమైన చర్చ జరిగి ఉండొచ్చని ప్రచారం జరుగుతూనే ఉంది. సీనియర్ నటుడు కృష్ణంరాజు మొదలుకొని నరేశ్, సాయికుమార్ దాకా ఎందరో నటులు బీజేపీతో అనుబంధం కలిగినవారే. జయప్రద కూడా ఇటీవలే బీజేపీలో చేరారు. జయసుధ కూడా చేరతారని ప్రచారం జరిగింది. ఇలా బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు హీరోలను కలవనుండటం ఇప్పుడు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది.