KAMAL: తమిళ ప్రజలకు కమల్ ధన్యవాదాలు
నా ప్రాణం, నా కుటుంబం, తమిళమే అని పునరుద్ఘాటించిన కమల్;
‘థగ్ లైఫ్’ ఈవెంట్లో కన్నడ భాషను ఉద్దేశించి అగ్ర నటుడు కమల్హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన నటించిన ‘థగ్ లైఫ్’ రిలీజ్కు కర్ణాటకలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘థగ్ లైఫ్’ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ఈ వివాదం గురించి మాట్లాడారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తనకు సపోర్ట్గా నిలిచిన తమిళనాడు ప్రజలకు కమల్ ధన్యవాదాలు చెప్పారు. తమిళ భాషపై తనకున్న ఇష్టాన్ని మరోసారి బయటపెట్టారు. ‘‘ఇలాంటి సమయంలో నాకు సపోర్ట్గా నిలిచిన తమిళనాడు ప్రజలకు ధన్యవాదాలు. ‘నా ప్రాణం, నా కుటుంబం, తమిళమే’ అన్న వ్యాఖ్యలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటా’’ అని ఆయన చెప్పారు. అనంతరం చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు. ‘‘ఎన్నో అంశాల గురించి మాట్లాడాల్సి ఉంది. అయితే వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన వేదిక కాదు. ఆయా విషయాల గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడాల్సిన బాధ్యత నాపై ఉంది. తప్పకుండా ఆ పనిచేస్తా’’ అని కమల్ హాసన్ వెల్లడించారు.
రాజ్యసభ నామినేషన్ వాయిదా
భాషా వివాదం నేపథ్యంలో కమల్హాసన్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో విడుదల కాబోయే తన చిత్రం ‘థగ్ లైఫ్’ వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి. కమల్ 2018లో ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. విపక్ష ఇండియా కూటమిలో ఇది భాగం. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం చేసింది. 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎంకు ఎగువసభ స్థానం కేటాయించారు. దీంతో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని డీఎంకే-ఎంఎన్ఎం ఇటీవల ఖరారు చేశాయి.