బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి వై కేటగిరి భద్రత కల్పించిన కేంద్రం
సెప్టెంబర్ 9న తాను ముంబై వస్తున్నానని.. దమ్ముంటే అడ్డు కోవాలని కంగనా సవాల్ చేశారు.;
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్... కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. ఇటీవల ముంబైని POKతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యల వివాదం నడుస్తుండగానే.. ఆమెకు భద్రత ఏర్పాటు చేయడం విశేషం. కంగనాకు ఒక సెక్యూరిటీ అధికారితోపాటు.. 10 మంది పోలీసులు భద్రత కల్పిస్తారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అటు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం వెలుగుచూసినపుడు కూడా.. కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లోని ఓ వర్గం అంతా చేయిస్తోందన్నారు. సుశాంత్ సింగ్ కేసును హ్యాండిల్ చేయడంలో మహారాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై ఆమె చేసిన కామెంట్లు.. నిప్పు రాజేశాయి. అలాంటి పరిస్థితుల్లో... రూలింగ్ శివసేన పార్టీ నేతలు కంగనాపై డైరెక్ట్ ఎటాక్కు దిగారు.
ముంబైలో నివసించడానికి భయంగా ఉందని కంగనా చేసిన కామెంట్లపై శివసేన నేతలు నిప్పులు చెరిగారు. అంత భయంగా ఉంటే ముంబైలో నివసించవద్దని ఆమెకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కంగనా మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆయన ఓ పురుష అహంకారి అని ఫైర్ అయ్యారు కంగనా. భారతీయ మహిళలపై ఇన్నిన ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురష అహంకారమే కారణమన్నారు. తాను మహారాష్ట్ర వాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. గతంలో ముంబైలో బతకలేపోతున్నామని చెప్పిన అమీర్ ఖాన్, నసీరుద్దీన్ షాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కంగనా సూటిగా ప్రశ్నించారు. ఓ మహిళ అయినందున తనపై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని కంగనా ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ 9న తాను ముంబై వస్తున్నానని.. దమ్ముంటే అడ్డు కోవాలని కంగనా సవాల్ చేశారు.