MADRAS HC: రివ్యూలకు బ్రేకుల్లేవ్... అది భావ ప్రకటనా స్వేచ్ఛ
రివ్యూలపై కోర్టు మెట్లెక్కిన తమిళ నిర్మాతల సంఘం.. ట్రోలింగ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న కోర్టు;
కరోనాతో థియేటర్లకు స్వస్తి చెప్పి.. ఓటీటీలకు అతుక్కుపోయిన నెటిజన్లు పాన్ ఇండియా మూవీస్ విడుదలైతేనే థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమాలకు కూడా రివ్యూ, పాజిటివ్ టాక్, మంచి బజ్ వస్తేనే థియేటర్లకు వెళ్తున్నారు. కంటెంట్ బావున్న సినిమాలకు ఈ రివ్యూలు లాభాలు తెచ్చిపెడితే.. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు ఈ రివ్యూలు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ విషయంపై అనేక వివాదాలు తలెత్తి... సద్దుమణినప్పటికీ.. తమిళ నిర్మాతల సంఘం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. మూవీ లవర్స్ సినిమాకు వెళ్లేముందు కచ్చితంగా రివ్యూలు, ఫీడ్ బ్యాక్ కచ్చితంగా చూస్తారు. దీంతో వీటిని చూసి థియేటర్కు వెళ్లాలా వద్దా అని ఖరారు చేస్తారు. ఒకప్పుడు ఈ సినిమా రివ్యూలు లేకపోయినప్పటికీ.. బంధువులు, స్నేహితుల ద్వారా మాత్రమే తెలుసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత సోషల్ మీడియా వినియోగం పెరగటం.. ఒక్కొక్కరూ 2, 3 యూట్యూబ్ ఛానెల్స్ మెయిన్టైన్ చేయటంతో సినిమా చూడకుండానే వారు సొంతంగా రివ్యూలు చెబుతున్నారనే వాదన ఉంది. ఫేవరెట్ హీరో అయితే ఒకలా.. కాకపోతే మరొకలా ఈ రివ్యూలు ఉంటున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ల వద్ద కూడా అభిమాన నటులైతే పాజిటివ్ రివ్యూ తీసుకుని.. కాకపోతే వారే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకునే దాఖలాలు లేకపోలేదు. దీంతో పాజిటివ్ కంటే నెగిటివిటీ ప్రజల్లోకి బాగా వెళ్లటంతో సినిమాలపై ప్రభావం చూపుతున్నాయని మేకర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు
ఈ విషయమై తమిళ నిర్మాతల సంఘం కోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదల తర్వాత మూడు రోజుల వరకు రివ్యూలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. భావప్రకటన స్వేచ్ఛను వ్యక్తీకరించే హక్కుగా ఉన్న రివ్యూలను ఆపటం సరైనది కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి ఆపడం అసాధ్యమని కోర్టు వెల్లడించింది. రివ్యూలను పూర్తిగా నిరోధించడం సాధ్యపడదని, సినీ పరిశ్రమకు చెందినవారు ట్రోలింగ్లను సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. సినిమా విడుదలైన వెంటనే రివ్యూలు రావడం వల్ల జరిగే నష్టాలను తగ్గించేందుకు, పబ్లిక్ స్పందనకు కొంత గ్యాప్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలా నిషేధించటం కుదరదని న్యాయపరంగా కూడా తేలింది.