పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా నుంచి 'మై డియర్ మార్కండేయ' వీడియో సాంగ్ రిలీజ్ అయింది. పవన్, సాయిధరమ్ తేజ్ లు కలిసి నటిస్తుండటంతో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. జూలై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాన్నినిర్మిస్తుంది. ఇప్పటికే పోస్టర్లు, ప్రోమోలు, టీజర్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన లభించింది. మరో బ్లాక్ బస్టర్ సాయి ధరమ్ తేజ్ ఖాతాలో పడనుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 'మై డియర్ మార్కండేయ' పాటను రేవంత్, స్నిగ్ధ శర్మ ఆలపించగా... రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. సమయం, జీవితం గురించి లోతైన భావంతో నిండిన ఈ పాట, సందేశాన్ని ఇవ్వడంతో పాటు అందరూ కాలు కదిపేలా ఉంది.
మై డియర్ మార్కండేయ పాట "కమాన్ కమాన్ డ్యాన్స్ బ్రో.. యమ్మా యమ్మా బీట్స్ బ్రో.. జిందగీనే జూక్బాక్స్ బ్రో" అంటూ ట్రెండీగా ప్రారంభమైంది. స్టైలిష్ అవతార్లో కనిపించిన సాయి ధరమ్ తేజ్ తనదైన నాట్యంతో ఆకట్టుకున్నారు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు ప్రొడక్షన్ డిజైన్ తో కన్నుల పండుగలా ఉంది పాట. ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.