గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో చాలా యేళ్ల తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో ఓ కొత్త కళ తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వరుసగా ప్రకటిస్తోన్న అవార్డ్స్ తో పాటు 2014 -2023 కాలంలో రూపొందిన సినిమాలకూ పురస్కారాలు ప్రకటించడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. ఈ అవార్డ్స్ తో పాటు ప్రత్యేక అవార్డ్స్ పేరుతో ఒక ఆరుగురిని పురస్కారంతో సన్మానించబోతోంది. ఇందుకోసం ఇండస్ట్రీకి చెందిన మహా మహుల పేర్లతో అవార్డ్స్ ను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో నందమూరి తారక రామారావు నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కోసం ఆయన తనయుడే అయిన నందమూరి బాలకృష్ణను ఎంపిక చేసింది. ఇప్పటికే బాలయ్య నటుడుగా 50యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. అటు రీసెంట్ భారత ప్రభుత్వం పద్మభూషణ్ ను కూడా అందించింది. ఇలాంటి ఆనంద సమయంలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ కు తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లెటర్ విడుదల చేశాడు.