Nikhil Spy: ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా ఓటీటీలోకి వచ్చిన 'స్పై'
రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ ప్లాట్ ఫారమ్ లోకి వచ్చేసిన 'స్పై'
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే 'కార్తికేయ 2'తో పాన్-ఇండియా విజయాన్ని రుచి చూశాడు. రీసెంట్ గా వచ్చిన స్పై మాత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రతికూల స్పందనలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఆశించిన ఫలితాలనివ్వలేదు. అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చిన ఈ సినిమాపై ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఓటీటీలోకి వచ్చింది.
గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన 'స్పై'.. నేతాజీ ఫైల్స్లో డాక్యుమెంట్ చేయబడిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే బాక్సాఫీస్ బోల్తా కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా స్పై మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
జూలై 27 ఉదయం నుంచి 'స్పై' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కావడంతో సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎలాంటి ప్రకటనా చేయకుండా డైరెక్టుగా ఓటీటీలోకి రావడం నిజంగా విస్మయానికి గురిచేస్తోంది. జూన్ 29న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఇక సినిమాకు సంబంధించి ప్రారంభంలో రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చినప్పటికీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నా.. వాటిని ఈ మూవీ ఏమాత్రం అందుకోలేకపోయింది. పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
ఇక స్పై రిజల్ట్ విషయంలో అప్పట్లో నిఖిల్ చేసిన పోస్ట్ సైతం వైరల్ అయింది. మరోసారి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానని ఈ పోస్ట్లో నిఖిల్ పేర్కొన్నాడు. పాన్ ఇండియన్ లెవెల్లో సరైన రీతిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో విఫలమయ్యామని, అలాగే ఓవర్సీస్లో 350కిపైగా తెలుగు ప్రీమియర్ షోస్ కూడా రద్దు కావడం బాధను కలిగించిందని నిఖిల్ చెప్పాడు. "నాపై నమ్మకంతో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుల నమ్మకాన్ని స్పైతో నిలబెట్టుకోలేకపోయాను. ఈ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా" అంటూ నిఖిల్ వివరించాడు. నా తదుపరి సినిమాల్ని పాన్ ఇండియన్ లెవెల్లో అనుకున్న టైమ్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తానని మాటిస్తున్నా. అంతే కాకుండా ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా మరోసారి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానని తెలుగు ఆడియెన్స్కు ప్రామిస్ చేస్తున్నా" అని ఈ లేఖలో నిఖిల్ పేర్కొన్నాడు.