ఓటీటీలో 'ఉదయ్ కిరణ్' ఆఖరి చిత్రం..

తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించినా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తే అవసరంలో ఆదుకునేవారు ఒక్కరూ ఉండరు. ఉదయ్ కిరణ్ విషయంలో అదే నిజమైంది.

Update: 2021-06-08 08:18 GMT

Uday Kiran:చిత్రం మూవీతో చిత్ర రంగంలోకి ప్రవేశించాడు. అనతి కాలంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఉదయ్‌కిరణ్‌ని హీరోగా పెట్టి తీసిన చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రభజనం సృష్టించాయి. నిర్మాతలకు లాభాల పంట పండించాయి. దాదాపుగా అతడు నటించిన అన్నిచిత్రాలు ప్రేమ కధలు కావడం విశేషం. దాంతో మంచి లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. కల్మషం లేని మనసు, చూడగానే ఆకట్టుకునే రూపం, నవ్వితే సొట్టబడే బుగ్గలు అతడిని అమ్మాయిల కలల రాకుమారుడిని చేశాయి. కానీ అతడి సక్సెస్ రేటు ఎక్కువ కాలం నిలవలేదు.

కొన్నాళ్లకు ఉదయ్ కిరణ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఈసారి కథ మార్చి కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామనుకుని 'శ్రీరామ్' అనే మాస్ సినిమా చేశాడు. కానీ అది కూడా అనుకున్నంతగా ప్రేక్షకులను రిసీవ్ చేసుకోలేకపోయింది. వరుస అపజయాలు, మరోపక్క మానసిక వేదన వెరసి 2015లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మంచి హీరోని ఇండస్ట్రీ కోల్పోయింది.

ఉదయ్ నటించిన చివరి చిత్రం ' చిత్రం చెప్పిన కథ' షూటింగ్ పూర్తి చేసుకున్నా కొన్ని ఆర్థిక కారణాలవల్ల ఆ చిత్రం విడుదల కాలేదు. ప్రస్తుతం ఇలా రిలీజ్ కాకుండా మూల పడిన పాత చిత్రాల సమాచారాన్ని సేకరించే పనిలో పడింది ఓటీటీ ప్లాట్ ఫామ్. ఆ చిత్రాల హక్కులను కొనుక్కుని కొత్తగా ఓటీటీల్లో రిలీజ్ చేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ కూడా చిత్రం చెప్పిన కథ కోసం యూనిట్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. డీల్ ఓకే అయితే ఉదయ్ కిరణ్ అభిమానులు తమ అభిమాన హీరో ఆఖరి చిత్రాన్ని ఓటీటీలో చూసే ఆనందించొచ్చు.

'చిత్రం'తో చిత్ర రంగ ప్రవేశం చేసి 'చిత్రం చెప్పిన కథ'తో జీవిత రంగ స్థలానికి ముగింపు పలికిన ఉదయ్ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ మరచిపోలేని ఓ తియ్యని జ్ఞాపకంగా మిగిలిపోయాడు.

Tags:    

Similar News