Crime News: నానమ్మను చంపిన మనవడు.. ఆస్తి కోసం అతి కిరాతకంగా..

Crime News: సినిమా ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. మలయాళ సినిమా చూసి మనవడు నానమ్మని అతి కిరాతకంగా చంపేశాడు.

Update: 2022-09-08 07:14 GMT

Crime News: సినిమా ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. మలయాళ సినిమా చూసి మనవడు నానమ్మని అతి కిరాతకంగా చంపేశాడు. సొంత తల్లి అని కనికరం లేకుండా కొడుకు.. నానమ్మ అని చూసుకోకుండా మనవడు వృద్ధురాలిని అన్యాయంగా చంపేశారు. ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు.

వృద్ధాప్యంలో తోడుగా నిలబడవలసిన వాళ్లే హతమారుస్తున్నారు. పూణె (మహరాష్ట్ర)లోని కేశవ్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఉషా విఠల్ గైక్వాడ్ (64) దేహురోడ్‌లోని ఆర్మీ క్యాంపస్‌లో పని చేసేవారు. పదవీ విరమణ తరువాత ఆమె కేశవ్ నగర్‌లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కొడుకు, కోడలు, మనవడు అదే ఇంట్లో ఉండేవారు.

అత్తా కొడళ్ల మధ్య ఎప్పుడూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే ఆగస్టు 5న మరోసారి గొడవ జరగడంతో కోడలు ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. ఆ రోజు మధ్యాహ్నం ఉషా నిద్రపోతుండగా.. మనవడు సాహిల్ (20) ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు.

తరువాత ఆమె డెడ్ బాడీని మాయం చేసేందుకు తండ్రితో కలిసి ప్లాన్ వేశాడు. చెట్లను నరికే ఎలక్ట్రిక్ కట్టర్‌తో వృద్ధురాలి మృతదేహాన్ని ముక్కలు చేసి సంచుల్లో కుక్కేశారు. వాటిని కారులో తీసుకెళ్లి ముథా నదిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగు వదిలేశారు. రక్తంతో తడిసిన కత్తి, దుస్తులను నది ఒడ్డున వదిలేశారు.

అన్నీ చేశాక.. ఏమీ ఎరగనట్టు పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశారు. ఆగస్టు 10న కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఉష కుమార్తెకు తన అన్న మీద అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతడిని విచారించారు.

అప్పుడు అసలు నిజం బయటపడింది. వృద్ధురాలి కుమారుడు, మనవడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నానమ్మ ఆస్తిపై కన్నేసిన మనవడు ఆమెను చంపితే ఆస్తి మొత్తం తనకే దక్కుతుందనుకున్నాడు.. కానీ ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.. తండ్రీ కొడుకులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. 

Tags:    

Similar News