మానసిక స్థితి సరిగాలేని తల్లి.. కవల పిల్లలను బావిలోకి విసిరి..

పిల్లల కోసం పరితపించింది. అంతలోనే వారిని అంతం చేసింది.

Update: 2024-01-19 05:52 GMT

ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఓ యువ తల్లి తన కవల పిల్లలను బావిలో పడేసి హత్య చేసింది. తపస్విని సాహు (27) గురువారం బసల గ్రామానికి చెందిన ముండాధిపి సాహిలో తన ఇంటి వెనుక ఉన్న బావిలో ఇద్దరు చిన్నారులను పడేసింది. అక్టోబరు 11న జన్మించిన కవలలకు అప్పుడూ నూరేళ్లు నిండిపోయాయి. తపస్విని సాహు, సునీల్‌ భార్యాభర్తలు.. పెళ్లైన చానాళ్ల వరకు సంతానం కలగలేదని కలత చెందేవారు దంపతులిరువురు. ఈ జంట చివరకు IVF కోసం వెళ్లారు, తపస్విని కవలలకు జన్మనిచ్చింది.

“గత కొన్ని రోజులుగా, తపస్విని మానసిక సమస్యలతో బాధపడుతోంది. పోలీసుల విచారణలో ఆమె తన కవలలను చంపినట్లు అంగీకరించింది. ప్రసవానంతర వ్యాకులత వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలనే ఆలోచన చేయలేకపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కవలలను బావిలో పడేసింది అని పోలీసులు తెలుసుకున్నారు. ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా ఆమెను అరెస్టు చేశాం’’ అని ఎస్‌డీపీఓ తెలిపారు.

పిల్లలు రాత్రంతా ఏడుస్తారని, గత కొన్ని రోజులుగా తాను అలసటతో బాధపడుతోందని, తన జీవితాన్ని అంతం చేసుకోవడం గురించి తరచూ మాట్లాడుతుండేదని నిందితురాలి అత్త చెప్పారు. "పిల్లలు తన వాళ్లు కాదని ఆమె కొన్నిసార్లు చెప్పింది. అప్పుడు మేం సీరియస్‌గా తీసుకోలేదు’’ అని బాధతో చెప్పింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పిల్లలు నిద్రిస్తున్న సమయంలో పాలు తీసుకొచ్చేందుకు అత్త బయటకు వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి శిశువులు కనిపించలేదు. కుటుంబీకులు, ఇరుగుపొరుగువారు పెద్దఎత్తున వెతకగా బావిలో పసికందుల మృతదేహాలు తేలాయి. స్థానికులు వారిని బంటాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున తన పిల్లలను హత్య చేసినట్లు మహిళ అంగీకరించింది.

Tags:    

Similar News