రాజస్థాన్ బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. చిన్నారిని కాపాడేందుకు అధికారుల కృషి ఫలించలేదు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు 16 గంటల తర్వాత చిన్నారిని వెలికితీశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఝలావర్ జిల్లాడగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్లా గ్రామానికి చెందిన ప్రహ్లాద్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి ఆదివారం పక్కనే ఉన్న పొలాల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న 250 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడ్డాడు. గమనించిన అతడి స్నేహితులు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 30 అడుగుల లోతులో బాలుడు చిక్కుకున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో పైప్ల ద్వారా లోపలికి ఆక్సిజన్ ను లోపలికి పంపించారు. చివరకు సోమవారం తెల్లవారుజామున 3:45 గంటలకు బాలుడిని వెలికి తీశారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.