కేరళలోని అంగన్ వాడీ కేంద్రాల మెనులో ఎగ్ బిర్యానీ వచ్చి చేరింది. పులావ్,దాల్ పాయసం,సోయా డ్రై కర్రీ, లడ్డూ కూడా యాడ్ అయ్యింది. “అంగన్వాడీలో ఉప్మాకు బదులు బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి” అంటూ.. బుజ్జిబుజ్జి మాటలతో ఓ చిన్నారి రిక్వెస్ట్ చేసిన వీడియో గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ బుడతడి కోరిక మేరకు అంగన్వాడీ మెనూల్లో మార్పులు జరిగాయి. నిన్న జరిగిన అంగన్ వాడీల రీ ఓపెనింగ్ ప్రోగ్రాంలో ఆ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి వీణా జార్జ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రాలకు కొత్త మెనూను ప్రకటించారు. అందులో ఎగ్ బిర్యానీ, పులావ్, దాల్ పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలను చేర్చారు. అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ ఒకేరకమైన మెనూను అమలు చేయడం ఇదే తొలిసారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు వారానికి రెండుసార్లు అందించే పాలను ఇకపై మూడుసార్లు అందించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలోని అలప్పూజా ప్రాంతానికి చెందిన శంకు అనే పిల్లాడు అంగన్వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, పలావ్ పెట్టాలని కోరుతూ వీడియో చేశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియో కేరళ హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె మెనూను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.