ప్రతిష్ఠాత్మకమైన మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. సోమవారం రాత్రి జైపూర్లో జరిగిన ఫైనల్స్లో ఆమె విజేతగా నిలిచారు. గత ఏడాది విజేత రియా సింఘా మణికకు కిరీటాన్ని అలంకరించారు. ఈ విజయంతో మణిక రాబోయే 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పోటీలు ఈ ఏడాది నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్నాయి.
రన్నరప్లుగా..
ఈ పోటీల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్గా నిలిచారు. హర్యానాకు చెందిన మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్గా, అమిషి కౌశిక్ థర్డ్ రన్నరప్గా నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మణిక.. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందారు. అలాగే పెయింటింగ్లోనూ గొప్ప నైపుణ్యం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'బిమ్స్టెక్ సెవోకాన్' కార్యక్రమంలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా లలిత కళా అకాడమీ, జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి గౌరవాలు కూడా అందుకున్నారు.
సామాజిక అంశాలపై..
కేవలం కళలు, విద్యకే కాకుండా, మణిక సామాజిక అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. న్యూరోడైవర్జెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆమె 'న్యూరోనోవా' అనే సంస్థను స్థాపించారు. ఏడీహెచ్డీ వంటి సమస్యలను లోపాలుగా కాకుండా ప్రత్యేకమైన మేధోశక్తులుగా చూడాలని ఆమె తన ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
విజయంపై మణిక..
విజయం సాధించిన తర్వాత మణిక తన ఆనందాన్ని పంచుకుంటూ.. ‘‘నా ప్రస్థానం నా స్వస్థలం గంగానగర్ నుంచి మొదలైంది. ఢిల్లీ వచ్చి ఈ పోటీలకు సిద్ధమయ్యాను. మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుకోవాలి. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. పోటీలు కేవలం ఒక రంగం కాదు, అవి వ్యక్తిత్వాన్ని నిర్మించే ఒక ప్రపంచం’’ అని చెప్పారు.