Bipin Rawat : కోట్లాది ప్రజల అశృనయనాల మధ్య రావత్ అంత్యక్రియలు
Bipin Rawat : బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ యోధుడికి యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది.;
Bipin Rawat : భరతమాత ముద్దుబిడ్డ, ఇండియన్ ఆర్మీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే ఆర్మీ యోధుడు.. బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆ యోధుడికి యావత్ దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ దంపతులకు భారత జాతి మొత్తం నివాళులు అర్పించింది. ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో రావత్, ఆయన సతీమణి మధులిక పార్థివ దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, ప్రముఖుల నివాళుల అనంతరం రావత్ కుమార్తెలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. రావత్ దంపతులపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని కుమార్తెలకు అధికారులు అందజేశారు. అంత్యక్రియల్లో గౌరవసూచికంగా 17 గన్ సెల్యూట్ నిర్వహించారు.
ఉదయం సైనిక సిబ్బంది, ప్రముఖుల సందర్శనార్థం రావత్ దంపతుల పార్థీవదేహాలను.. కామరాజ్ మార్గ్లోని ఆయన నివాసంలో ఉంచారు. మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల వరకు.. ప్రముఖులు రావత్ దంపతులకు నివాళులర్పించారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ, రాజ్యసభ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సహా పలుపార్టీల ఎంపీలు, నేతలు పుష్పాంజలి ఘటించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆర్మీ చీఫ్ నరవణె, ఐఏఎఫ్ చీఫ్ చౌదురి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల నుంచి ఒంటిగంట 30నిమిషాల వరకు సైనిక అధికారులు, సిబ్బంది తమ ప్రియ నాయకునికి అంజలి ఘటించారు.