Bipin Rawat: శుక్రవారం సాయంత్రం బిపిన్ దంపతుల అంత్యక్రియలు..

Bipin Rawat: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి తరలించనున్నారు.

Update: 2021-12-09 09:00 GMT

Bipin Rawat (tv5news.in)

Bipin Rawat: సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ భౌతికకాయాన్ని ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి తరలించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు జనరల్ రావత్‌ దంపతుల భౌతికకాయాలను ఢిల్లీలోని అధికారిక నివాసానికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ధౌలా కువాన్‌లోని బ్రార్‌ క్రిమేటోరియానికి త్రివిధ దళాల మిలటరీ బ్యాండ్స్‌ మధ్య అంతిమయాత్రగా తీసుకువస్తారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

మరోవైపు హెలికాప్టర్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్‌ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరుణ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. లైఫ్‌ సపోర్టుపై వరుణ్‌సింగ్‌కు చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. అవసరమైతే బెంగళూరుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

బిపిన్‌ రావత్‌ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. వెల్లింగ్టన్‌లోని మద్రాస్ రెజిమెంటల్‌ సెంటర్‌కు వెళ్లిన తమిళిసై.. రావత్‌ సహా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

బిపిన్‌ రావత్‌ మృతి పట్ల అగ్రరాజ్యం అమెరికా సంతాపం ప్రకటించింది. రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యానికి రావత్‌ బలమైన ప్రతినిధిగా నిలిచారని అమెరికా కొనియాడింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను గుర్తుచేసుకుంది. 

Tags:    

Similar News