UP: ఓటీపీతో వీడిన ఉత్తరప్రదేశ్‌లోని మర్డర్ మిస్టరీ

భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’..

Update: 2026-02-11 05:30 GMT

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య చనిపోయిన రెండేళ్ల తర్వాత మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలేం జరిగింది? ఓటీపీ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

సందీప్-ప్రియాంక భార్యాభర్తలు. మే 14, 2017న వివాహం జరిగింది. ప్రియాంకది కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పిల్ఖాన్ గ్రామం. సందీప్‌ది బస్తీ జిల్లా. ఏడేళ్లు సంసారం బాగానే సాఫీగా సాగింది. ఒక కొడుకు కూడా జన్మించాడు. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం ప్రారంభం అయ్యాయి. జూలై 1, 2024న ఇంట్లో నుంచి నగలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపణలు వచ్చాయి. అలా ఆరోపణలు వచ్చాయో.. లేదో గంటల వ్యవధిలోనే బిడ్డను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు అయోధ్యకు వెళ్లింది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుతుండగా.. రాజస్థాన్ నుంచి అయోధ్యకు వచ్చిన మంగళచంద్ర అనే వ్యక్తి అడ్డుకున్నాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళచంద్రతో కలిసి రాజస్థాన్ వెళ్లిపోయి భార్యాభర్తలుగా జీవిస్తున్నారు.

అయితే ఇంతలో భార్య అదృశ్యం కావడంపై సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగల కోసం తన భార్యను అత్తమామలు చంపేసి నదిలో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును పోలీసులు స్వీకరించలేదు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. నవంబర్ 4, 2024న న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రియాంక తండ్రి దయారాం, తల్లి శుభవతి దేవి, మామ కుమార్తె, మరొక గ్రామస్థుడు అశోక్ కుమార్ మౌర్యపై కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నిందితులుగా చేర్చి హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నడుస్తోంది.

అయితే ఈ క్రమంలో ప్రియాంక ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లింది. ఫొటో, అడ్రస్ మార్పు చేసుకుంటుండగా సడన్‌గా ‘‘ఓటీపీ’’ నెంబర్ సందీప్‌ మొబైల్‌కు వెళ్లింది. ఆధార్ ఓటీపీ రావడంతో ఒక్కసారిగా అవాక్కై పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు రాజస్థాన్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూపీలాగారు. ప్రియాంక చిరునామా తెలుసుకుని ఇంటికి వెళ్లగా ప్రత్యక్షమైంది. అనంతరం ఆమెను బస్తీ జిల్లాకు తీసుకొచ్చారు.

పోలీస్ స్టేషన్‌లో ప్రియాంకను చూసి తండ్రి దయారాం, భర్త సందీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి కౌగిలించుకుని ఏడ్చారు. సందీప్ తన కుమారుడిని దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించగా వెళ్లేందుకు నిరాకరించాడు. కుమారుడు నిజమైన తండ్రి అని గుర్తించలేకపోయాడు. భార్యను ఉంచుకునేందుకు ఇష్టపడ లేదు గానీ.. బిడ్డను దత్తత ఇవ్వాలని సందీప్ కోరగా ఆమె నిరాకరించింది.

2024లో కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మహిళ హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని ఏఎస్పీ శ్యామ్‌కాంత్ తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. బిడ్డను అప్పగించాలని సందీప్ కోరాడని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

Tags:    

Similar News