బర్డ్ ఫ్లూ భయం.. భారీగా పడిపోయిన చికెన్, కోడిగుడ్ల ధర
చికెన్ ధరలు 15 నుంచి 20 శాతం పతనం అయ్యాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది.;
దేశంలోని బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న తీరు భయపెడుతోంది..ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో వైరస్ నిర్ధారణ అయింది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో 'బర్డ్ ఫ్లూ' గుప్పిట్లో చిక్కుకున్నాయి. హర్యానా, గుజరాత్, రాజస్థాన్లో ఆదివారం మరిన్ని కేసులు నిర్ధారణ కావడంతో వ్యాధి విస్తరించడకుండా కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
హర్యానాలోన పంచకుల జిల్లాలో ఇటీవల రెండు పౌల్ట్రీ ఫామ్లతో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో తొమ్మిది ర్యాపిడ్ యాక్షన్ బృందాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. గుజరాత్లోని సూరత్, రాజస్థాన్లోని సిరిహి జిల్లాలోనూ వైరస్ నిర్ధారణ అయింది. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పక్షలు, కాకులు, పౌల్ట్రీ మరణాలు సంభవించినా గుర్తుతెలియని రోగాలతో ఇవి మరణించినట్టు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ భయంతో కొన్ని రోజుల్లోనే హోల్సేల్ మార్కెట్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. పంజాబ్, హర్యానాల్లోని పౌల్ట్రీ ఫామ్ల్లో భారీగా కోళ్లు చంపేయడం, యూపీలోనూ బర్డ్ఫ్లూ కేసులు నమోదు కావడం ప్రజల్లో ఆందోళన మరింత పెంచేసింది.
చికెన్ సేల్స్ 70 శాతానికి పైగా పడిపోగా..ధరలు కూడా 15 నుంచి 20 శాతం పతనం అయ్యాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది..ఇంతకుముందు కూడా కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. ఇప్పుడు ఫ్లూ కలకలంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కోళ్ల రవాణాపై నిషేధం విధిస్తున్నారు. వదంతుల నుంచి పౌల్ట్రీ రంగాన్ని కాపాడాలని పౌల్ట్రీ ఫెడరేషన్ కేంద్రాన్ని కోరింది.